స‌తీష్ రెడ్డి.. ఏమిటీ గ‌తి?

పులివెందుల‌లో వైఎస్ కుటుంబంపై పోటీ చేసిన నేత‌గా ఆయ‌న‌కు గొప్ప పేరుంది.. తెగించి మ‌రీ పార్టీని ముందుకు న‌డిపార‌నే గుర్తింపు ఉంది. కానీ ఆ నేత ప్ర‌స్తుత రాజ‌కీయ భ‌విష్య‌త్ అయోమ‌యంగా మారింది. ఇప్పుడు ఏ పార్టీలో లేక‌.. ఏం చేయాలో పాలుపోక క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉన్నార‌ని తెలిసింది. ఆ నాయ‌కుడే స‌తీష్ రెడ్డి. క‌డ‌ప జిల్లా సీనియ‌ర్ నేత అయిన స‌తీష్ ఇప్పుడు రాజ‌కీయాల‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు. టీడీపీకి రాజీనామా చేసిన త‌ర్వాత ఆయ‌న పొలిటిక‌ల్ కెరీర్ ముందుకు సాగ‌డం లేదు.

పులివెందుల‌లో గ‌త కొన్నిసార్లుగా వైఎస్ కుటుంబంపై పోటీ చేసి స‌తీష్ సంచ‌ల‌నం సృష్టించారు. ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ వైఎస్ కుటుంబాన్ని ఎదుర్కొన్నార‌న్న ఏకైక కార‌ణంతోనే ఆయ‌న‌కు టీడీపీలోనూ రాష్ట్ర రాజ‌కీయాల్లోనూ ప్ర‌త్యేక గుర్తింపు ల‌భించింది. అందుకే చంద్ర‌బాబు స‌తీష్‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి ప్రాధాన్య‌త కల్పించారు. మ‌రోవైపు పులివెందుల‌కు నీరు అంటూ శ‌ప‌థం చేసిన స‌తీష్ గ‌డ్డం పెంచి త‌ర్వాత మొక్కు తీర్చుకున్నారు. కానీ 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మితో ఆయ‌న స్లో అయ్యార‌ని అంటున్నారు. ఆ ప‌రాజ‌యం త‌ర్వాత టీడీపీ కోలుకోవ‌డం క‌ష్ట‌మ‌ని, లోకేష్ నాయ‌క‌త్వంలో ఆ పార్టీ ఎప్ప‌టికీ అధికారంలోకి రాద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి పార్టీకి రాజీనామా చేశారు.

టీడీపీని వీడిన త‌ర్వాత స‌తీష్ వైసీపీలో చేర‌తార‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. కానీ త‌న కుటుంబానికి వ్య‌తిరేకంగా నిల‌బ‌డ్డ వ్య‌క్తిని చేర్చుకోవ‌డం ఇష్టం లేక జ‌గ‌న్ ప‌క్క‌న‌పెట్టార‌ని అంటుంటారు. దీంతో ఇప్పుడు వైసీపీ, టీడీపీకి ఆయ‌న దూరంగా ఉంటున్నారు.

తాజాగా పులివెందుల‌లో టీడీపీ ఇంఛార్జీగా బీటెక్ ర‌విని బాబు నియ‌మించ‌డంతో ఇక స‌తీష్ పొలిటిక‌ల్ కెరీర్‌కు శుభం కార్డు ప‌డుతుంద‌ని అనిపిస్తోంది. కానీ మ‌రోవైపు ర‌విని పులివెందుల టీడీపీ క్యాడ‌ర్ ఓన్ చేసుకోలేక‌పోతుంద‌ని అంటున్నారు. అందుకే మ‌ళ్లీ స‌తీష్‌ను పార్టీలోకి తీసుకుని నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జీగా నియ‌మిస్తే మంచిద‌ని కొంత‌మంది నేత‌లు బాబు సూచించారు. కానీ స‌తీష్ పార్టీలోకి వ‌చ్చినా టికెట్ ఇచ్చేది లేద‌ని, ర‌వినే నిల‌బెడ‌తాన‌ని బాబు స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో స‌తీష్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.