జిల్లాల ఏర్పాటుపై ఎవ‌రితో చ‌ర్చించారు.. జ‌గ‌న్‌కు సొంత ఎమ్మెల్యే ప్ర‌శ్న‌!

ఏపీలో కొత్త‌గా ఏర్పాటు చేస్తున్న 13 జిల్లాలపై సీఎం జ‌గ‌న్‌కు సొంత పార్టీ వైసీపీలో అసంతృప్తి సెగ‌లు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే సొంత జిల్లా క‌డ‌ప‌లో నేత‌లు క‌దం తొక్కుతున్నారు. రాజంపేట‌ను జిల్లా కేంద్రం చేయాల‌ని వైసీపీ నాయ‌కులు రిలే నిరాహార దీక్ష‌లు చేస్తున్నారు. నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. స‌ర్కారు వ్య‌తిరేకంగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక‌, ఇప్పుడు ఈ జాబితాలో నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌వ‌ర్గం వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి కూడా చేరిపోయారు. జిల్లాల విభజన తీరుపై ఆనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సోమశిల, కండలేరు జలాశయాలు 2 జిల్లాల పరిధిలోకి వస్తున్నాయని.. ఫలితంగా నీటి వివాదాలు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోవటం, ప్రజాప్రతినిధులతో చర్చించకుండా విభజన చేయటం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులతో చర్చించకుండా అస‌లు ప్రక్రియను ఎలా మొద‌లు పెడ‌తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇలా చేయ‌డం సరికాదన్నారు. విభజన ప్రక్రియలోని లోపాలను సరిదిద్దకుంటే అన్నివిధాలా నష్టమేనని చెప్పారు. అస‌లు జిల్లాల‌పై చ‌ర్చించే స‌మ‌యం సీఎం జ‌గ‌న్‌కు ఉందా లేదా? అని కూడా ప్ర‌శ్నించారు. రాపూరు, కలువాయి, సైదాపురాన్ని నెల్లూరులోనే ఉంచాలంటున్నారు.

వీటిని కొత్త‌గా ఏర్పాటు చేస్తున్న శ్రీబాలాజీ జిల్లాలో చేరడం మూడు మండలాల ప్రజలకు ఇష్టం లేదన్నారు. సీఎం జగన్, ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాల‌న్నారు. 2009 విభజన ప్రక్రియలోనూ రాపూరుకు అన్యాయం చేశారని, విభజన ప్రక్రియలోని లోపాలను సరిదిద్దకుంటే అన్నివిధాలా నష్టమేన‌ని వ్యాఖ్యానించారు. నిజానికి వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గాన్ని నెల్లూరు నుంచి విడ‌దీసి.. శ్రీబాలాజీ జిల్లాలో క‌ల‌ప‌డంతో నెల్లూరులో అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న సంపాయించుకున్న ప‌లుకుబ‌డి చీలిపోయింది. ఇది వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. అందుకే.,. కొన్నాళ్లుగా ఉన్న అసంతృప్తికి ఇప్పుడు జిల్లాల విభ‌జ‌న తోడైంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మార్చి 18 నాటికి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా అధికారులు ప్రణాళికను రూపొందించారు. అదేరోజు నుంచి కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలు పనిచేయనున్నారు. పాత జిల్లాలకు కూడా వీరే ఇన్‌ఛార్జి కలెక్టర్లుగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రకటించిన కొత్త జిల్లాలకు ఉద్యోగులు, అధికారులను కేటాయించడం, మౌలిక వసతుల కల్పన, ఇతర చర్యలు పూర్తయ్యేంత వరకూ వీరే పాత జిల్లాల బాధ్యతలను నిర్వర్తించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ పాత జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చినా విభజన, మౌలిక వసతుల కల్పన తదితర వ్యవహారాలను వీరే పర్యవేక్షిస్తారని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.