తెలుగు మీడియా స‌ర్కిల్స్‌లో క‌ల‌క‌లం

Corona

క‌రోనాకు ఎదురెళ్లి విధులు నిర్వ‌ర్తిస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల‌కు అంద‌రూ స‌లాం కొట్టేవాళ్లే. వాళ్ల గొప్ప‌ద‌నాన్ని కీర్తించేవాళ్లే. ప్ర‌భుత్వం కూడా వారి క‌ష్టాన్ని గుర్తించి ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చింది. ఐతే మీడియా వాళ్లు సైతం క‌రోనాపై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్న వాళ్లే. వైర‌స్ విజృంభిస్తున్న చోట్ల‌కే వెళ్లి రిపోర్టింగ్ చేస్తున్నారు.

లాక్ డౌన్ టైంలో కూడా ఆఫీసుల‌కెళ్లి విధులు నిర్వ‌ర్తించారు. అయినా వారి క‌ష్టాన్ని గుర్తించిన వాళ్లెవ్వ‌రూ లేరు. ఇన్సెంటివ్స్ లేక‌పోగా.. ఉన్న జీతాల్లోనే కోత ప‌డింది. ఉద్యోగాలూ లేచిపోయాయి. ఇవ‌న్నీ చాల‌వ‌ని ఇప్పుడు జ‌ర్న‌లిస్టులు వ‌రుస‌గా క‌రోనా బారిన ప‌డి ఆసుప‌త్రుల‌కు ప‌రుగులు పెడుతుండ‌టం ఆ వ‌ర్గాల్లో ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ఇప్ప‌టికే కొంత‌మంది రిపోర్ట‌ర్లు క‌రోనా బారిన ప‌డ్డారు. మ‌నోజ్ అనే టీవీ5 జ‌ర్న‌లిస్టు ప్రాణాలు కూడా కోల్పోయాడు.

ఇప్పుడు తాజాగా పెద్ద ఎత్తున మీడియా ప్ర‌తినిధుల్లో క‌రోనా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆదివారం 140 మంది తెలుగు రిపోర్ట‌ర్ల‌కు క‌రోనా టెస్టులు చేయ‌గా.. అందులో 23 మంది పాజిటివ్‌గా తేలారు. వీళ్లంద‌రినీ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నారు. వీరి కుటుంబ స‌భ్యులు, వారితో స‌న్నిహితంగా మెలిగిన వారికి కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ టెస్టులు జ‌ర్న‌లిస్టుల బ‌ల‌వంతం మేర‌కు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో ఆరోగ్య మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను క‌రోనా టెస్టుల కోసం అడిగారు రిపోర్ట‌ర్లు. ఐతే ఆయ‌న మాత్రం మీరంతా బాగానే ఉన్నారు కదా, మీకెందుకు టెస్టులు అంటూ న‌వ్వుతూ బ‌దులిచ్చారు. కానీ జ‌ర్న‌లిస్టులు ఊరుకోకుండా త‌మ‌కు టెస్టులు చేయాల్సిందే అని డిమాండ్ చేయ‌డంతో ఆయ‌న అంగీక‌రించారు. అలా ప‌రీక్ష‌లు చేస్తేనే 23 మంది రిపోర్ట‌ర్ల‌కు క‌రోనా ఉన్న‌ట్లు తేలింది. దీంతో మీడియా వ‌ర్గాలు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాయి.