27 వేల కోట్లు అప్పు.. ఢిల్లీ వెళ్లి జ‌గ‌న్ చేసిందిదే

ఏపీ సీఎం జ‌గ‌న్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా..అనేక సందేహాలు.. అనుమానాలు.. వ్యాఖ్యానాలు..చ‌ర్చ‌లు కామ‌న్‌. త‌న కేసుల ప‌రిష్కారం కోస‌మే ఆయ‌న వెళ్లాడ‌ని ఎక్కువ మంది అభిప్రాయ‌ప‌డుతుంటారు. లేదు.. కేంద్రంతో సంధిచేసుకునేందుకు వెళ్లార‌ని మ‌రికొంద‌రు అంటుంటారు. అయితే.. తాజాగా జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన విష‌యాల్లో కీల‌క మైన అంశాన్ని కేంద్ర‌మే ఇప్పుడు బ‌య‌ట పెట్టింది. గ‌త నెల‌లో ఢిల్లీ వెళ్లిన జ‌గ‌న్ ప్ర‌ధానిన‌రేంద్ర మోడీని, అమిత్‌షాను కూడా క‌లుసుకున్నారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న ఏం చర్చించార‌నే అంశం ఇప్ప‌టికీ ఆస‌క్తిక‌ర‌మే. ఈ విష‌యంపైనే కేంద్రం తాజాగా పార్ల‌మెంటు సాక్షిగా వివ‌ర‌ణ ఇచ్చింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో మరింత అప్పు చేసేందుకు ఏపీ అభ్యర్థించిందని పార్లమెంట్లో కేంద్రం వెల్లడించింది. మరో రూ.27 వేల కోట్లు అప్పు చేసేందుకు అనుమతి కోరిందని పేర్కొంది. బహిరంగ మార్కెట్‌లో అప్పు చేసేందుకు సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా ప్లీజ్ ప్లీజ్ అంటూ.. విజ్ఞప్తి చేశారని.. కేంద్ర ఆర్థికశాఖ స‌హాయ మంత్రి వెల్లడించారు. గత నెల ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ ఇలా కోరారని చెప్పారు. 2021-22లో ఉన్న పరిమితిని రూ.42,472 కోట్లకు పెంచాలని అభ్యర్థించారని తెలిపారు. అయితే.. కేంద్రం ఏ చెప్పింది.? జ‌గ‌న్ అభ్య‌ర్థ‌న‌కు ఓకే చెప్పిందా? అనే విష‌యాన్ని మాత్రం కేంద్ర మంత్రి వెల్ల‌డించ‌లేదు.

ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న విష‌యంపై టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు  కనకమేడల ర‌వీంద్ర‌కుమార్ అడిగిన‌ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి రాజ్యసభలో బదులిచ్చారు. దీంతో జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న కేవ‌లం అప్పుల కోస‌మేనా? అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నిజానికి ప్ర‌ధాని అంత‌టి వారిని క‌లుసుకునే అవ‌కాశం చిక్కితే.. రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పైనా.. స‌మ‌స్య‌ల‌పైనా ప‌ట్టుబ‌డ‌తారు. కానీ, సీఎం అప్పుల కోసం ప‌ట్టుబ‌ట్టిన విష‌యం బ‌హిరంగ‌మైంది. మ‌రి ఇది ఏ వివాదానికి దారి తీస్తుందో చూడాలి.

ఇదిలావుంటే, మ‌రోవైపు.. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆర్‌బీఐ ద్వారా మరోసారి సెక్యూరిటీ బాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసింది. సెక్యూరిటీ బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్లు రుణం పొందింది. 7.37 శాతం మేర వడ్డీకి సెక్యూరిటీ బాండ్లు వేలం వేసింది. 16 ఏళ్ల కాలపరిమితితో వెయ్యి కోట్లు, 20 ఏళ్ల పరిమితితో మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది.