కేంద్రం ప్రవేశ పెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దేశ ప్రగతికి ఈ బడ్జెట్ నాంది పలుకుతుందని తెలిపారు. ఉత్పాదక, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయడం ద్వారా దేశ ప్రగతిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కేంద్ర బడ్జెటును రూపకల్పన చేయడం ఆశావహ పరిణామమని పేర్కొన్నారు. అయితే.. ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్ వంటి అంశాలు చోటుచేసుకోకపోవడం కొంత నిరాశను కలిగించిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో మన దేశం పోటీ పడే విధంగా ఒక గొప్ప దార్శనికతను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తోందని చెప్పడం అతిశయోక్తి కాదనా్నరు.
కాలానుగుణంగా మారుతున్న సాంకేతికతను దేశంలో ప్రవేశ పెట్టడానికి సంకల్పించిన ప్రయత్నాలు మంచి ఫలితాన్ని అందిస్తాయని జనసేన భావిస్తోందని పవన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి గతిశక్తి బహుళార్ధక పథకం దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇచ్చే విధంగా ఉందన్నారు. డిజిటల్ కరెన్సీ, డిజిటల్ బ్యాంకింగ్ కారణంగా వ్యాపార వ్యవహారాలు, నగదు లావాదేవీల్లో పారదర్శకత పెరిగి అవకతవకలు తగ్గే అవకాశం ఉందన్నారు. డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు కారణంగా దేశ సాంకేతిక అవసరాలు తీర్చగల టెక్కీలు రూపొందుతారని తలిపారు.
ప్రాంతీయ భాషలలో విద్య బోధన కోసం 200 టీవీ చానళ్ళు ప్రారంభించడానికి సంకల్పించడం ప్రాంతీయ భాషలలో విద్యార్జన చేయాలనుకునే వారికి మేలు కలిగిస్తుందన్నారు. రక్షణ రంగం బడ్జెట్ 12% పెంచడం మన దేశ భద్రతరీత్యా అవసరమేనని తెలిపారు. కరోనా కారణంగా ఎన్నో కష్టనష్టాలు చవిచూస్తున్నామన్న పవన్.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా కాపాడిన వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం రైతన్నలకు భరోసా కల్పించడంగా జనసేన భావిస్తోందని తెలిపారు. ఆధునిక వ్యవసాయం దిశగా వేసే అడుగుల వేగం పెరిగిందని అవగతమవుతోందని పేర్కొన్నారు.
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని గత బడ్జెట్లో ప్రకటించిన ప్రభుత్వం ఆ హామీకి ఎంత చేరువ అయ్యారో ఈ బడ్జెట్లో ప్రస్తావించి ఉంటే బేరీజు వేసుకోడానికి వీలుండేదని సునిశిత విమర్శ చేశారు. సేంద్రీయ ప్రకృతి సేద్యానికి ప్రాధ్యానం ఇవ్వడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవుల పెంపకం గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావించిన విషయాలు ప్రయోజనకరమైనవేనని అన్నారు. ప్రజలకు వ్యక్తిగత ప్రయోజనాలు ఈ బడ్జెట్లో లేనప్పటికీ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించారని తెలిపారు.
ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు కొత్తగా కల్పిచాలని ఈ బడ్జెట్లో పేర్కొనడాన్ని జనసేన స్వాగతిస్తోందన్నారు. అదేవిధంగా రాష్ట్రాలకు లక్ష కోట్ల రూపాయలతో నిధి, అదేవిధంగా 50 ఏళ్ల వరకు వడ్డీ లేకుండా లక్ష కోట్ల రూపాయల రుణాన్ని రాష్ట్రాలు తీసుకునే అవకాశం రాష్ట్రాలకు మేలు చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలపై కొత్తగా పన్నుల భారం వేయకుండా బడ్జెటును రూపొందించిన ప్రధాని మోడీకి పవన్ అభినందనలు తెలిపారు.
This post was last modified on February 2, 2022 9:25 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…