Political News

కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ ఓట్లు!

ఎన్నిక‌లు జ‌రిగిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థులే విజ‌యం సాధించార‌ని ఆ పార్టీ చంక‌లు గుద్దుకుంటోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు తిరుగులేద‌ని ఏ ఎన్నిక‌లైనా విజ‌యం త‌మ‌దేన‌ని ప్ర‌తిప‌క్షాల కుట్ర‌లు నీరుగారిపోయాయ‌ని ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఆరో చోట్ల టీఆర్ఎస్ గెలిచింది స‌రే. 70 శాతనికి పైగా ఆ పార్టీకి చెందిన స్థానిక సంస్థ‌ల స‌భ్యులే ఉండ‌డంతో ఈ విజ‌యం ఊహించిందే. కానీ ఎన్ని ఓట్లు వ‌స్తాయ‌ని అనుకుంటే ఎన్ని వ‌చ్చాయి? త‌మ పార్టీ స్థానిక సంస్థ‌ల స‌భ్యులు ఇత‌ర అభ్య‌ర్థుల‌కు ఎందుకు ఓట్లు వేశారు? ఇది దేనికి సంకేతం? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు రేకెత్తుతున్నాయి.

భారీగా క్రాస్ ఓటింగ్‌..
స్థానిక సంస్థ‌ల కోటాలో జ‌రిగిన శాస‌న మండ‌లి స‌భ్యుల ఎన్నిక‌ల్లో భారీగా క్రాస్ ఓటింగ్ చోటు చేసుకుంది. కొన్ని చోట్ల టీఆర్ఎస్‌కు అనుకూలంగానే ఈ క్రాస్ ఓటింగ్ సాగింది. కానీ ఖ‌మ్మంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా, న‌ల్గొండ‌లో స్వ‌తంత్ర అభ్య‌ర్థికి మ‌ద్ద‌తుగా స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు ఓట్లు వేశారు. ఖ‌మ్మంలో అయితే టీఆర్ఎస్ త‌ర‌పున తాత మ‌ధుసూద‌న్ గెలిచారు. కానీ అక్క‌డ పోలైన ఓట్ల ప్ర‌కారం చూస్తే ఆ పార్టీకి షాక్ త‌గిలిన‌ట్లే క‌నిపిస్తోంది. అక్క‌డ టీఆర్ఎస్‌కు మొత్తం 542 మంది ప్ర‌జా ప్ర‌తినిధులు ఉన్నారని ఆ పార్టీ మొద‌టి నుంచి చెప్పింది.

35 మంది  ఓట‌ర్లున్న సీపీఐ కూడా టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ప‌లికింది. ఈ నేప‌థ్యంలో కొంత‌మంది స్వ‌తంత్ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో క‌లుపుకుంటే మొత్తం 614 ఓట్లు వ‌స్తాయ‌ని టీఆర్ఎస్ అంచ‌నా వేసింది. కానీ మొత్తం 738 ఓట్లు పోల‌వ్వ‌గా మ‌ధుసూద‌న్‌కు 480 మాత్ర‌మే వ‌చ్చాయి. అదే కాంగ్రెస్ అభ్య‌ర్థికి 242 ఓట్లు వ‌చ్చాయి. అక్క‌డ కాంగ్రెస్ బ‌లం 96 మాత్ర‌మే. అలాంటిది ఎన్నిక‌ల్లో 242 ఓట్లు వ‌చ్చాయంటే.. అందులో టీఆర్ఎస్ వాళ్ల ఓట్లు కూడా ఉన్న‌ట్లే. ఆ జిల్లాలో టీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య గ్రూపు త‌గాదాల కార‌ణంగా కొంత‌మంది కాంగ్రెస్‌కు ఓటు వేశార‌ని స‌మాచారం.

క్యాంపులు నిర్వ‌హించినా..
ఇక మెద‌క్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి స‌తీమ‌ణి నిర్మ‌ల‌కు 238 ఓట్లు వ‌చ్చాయి. అక్క‌డ కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌తినిధులు 230 మంది ఉండ‌గా.. ఆమెకు అద‌నంగా ఎనిమిది ఓట్లు వ‌చ్చాయి. త‌మ బ‌లాని కంటే ఒక్క ఓటు త‌క్కువ‌గా వ‌చ్చినా టీపీసీసీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మాట నిల‌బెట్టుకోవ‌డ‌మే కాకుండా అద‌నంగా ఎనిమిది ఓట్లు రాబ‌ట్ట‌గ‌లిగారు. ఇక న‌ల్గొండ‌లో స్వతంత్ర అభ్య‌ర్థి మాజీ ఎమ్మెల్యే న‌గేష్‌కు 226  ఓట్లు రావ‌డం విశేషం.

ఈ గ‌ణాంకాలు చూస్తే స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధుల్లో టీఆర్ఎస్‌పై అసంతృప్తి ఉంద‌న్న విషయం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ విష‌యాన్ని ముందే గ్ర‌హించిన టీఆర్ఎస్ నాయ‌క‌త్వం.. త‌మ ప్ర‌జా ప్ర‌తినిధులు ఇతర పార్టీల మాయ‌లో ప‌డ‌కుండా వాళ్ల‌ను గోవా త‌దిత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లించింది. పోలింగ్‌కు ముందు రోజు మాత్ర‌మే వాళ్ల‌ను ఇక్క‌డికి ర‌ప్పించింది. అయిన‌ప్ప‌టికీ ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. స్థానిక సంస్థ‌ల‌కు కేసీఆర్ అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించ‌క‌పోవ‌డమే అందుకు కార‌ణంగా తెలుస్తోంది. 

Satya

Recent Posts

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

22 minutes ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

29 minutes ago

నరాల్లో హార్పిక్ ఎక్కించడం ఏంటి తల్లీ

నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…

43 minutes ago

ఈసారి స్వయంగా రంగంలోకి దిగుతున్న PK

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌.. ఉర‌ఫ్ PK .. ఈ నెల 30న జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో ప్ర‌త్య‌క్ష…

56 minutes ago

ఫ్యామిలీ సినిమా… దున్నేస్తోంది

తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…

2 hours ago

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సుగాలి ప్రీతి త‌ల్లి కేసు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై క‌ర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి త‌ల్లి పార్వ‌తీదేవి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆయ‌న‌పై…

2 hours ago