ఓటీఎస్…రూ.4800 కోట్లకు జగన్ స్కెచ్ వేశారంటోన్న టీడీపీ నేత

ఏపీలో ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 1983-2011 మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వ హౌసింగ్‌ కార్పొరేషన్ ద్వారా ఇళ్లు నిర్మించుకొని బకాయి ఉన్నవారిని ప్రబుత్వం గుర్తించింది. వారంతా వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) ద్వారా ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. కానీ, తమ ఇళ్లకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ పట్టాలున్నాయని, మరోసారి రిజిస్ట్రేషన్ అవసరం లేదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ పథకంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకంతో పేదలను జగన్ మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేదల ఇళ్లను వారికే రిజిస్ట్రేషన్ చేసిచ్చే హక్కు ప్రభుత్వానికి లేదని అన్నారు. అంతేకాదు, ఈ పథకం కింద 46 లక్షల మంది పేదల నుంచి రూ. 4,800 కోట్లు రాబట్టేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని ఆయన ఆరోపించారు. ఓటీఎస్ పేరుతో పేదలను ప్రభుత్వం ఒత్తిడికి గురి చేస్తోందని ఆరోపించారు.

కొన్ని చోట్ల వలంటీర్లు బెదిరింపులకు దిగుతున్నారని, డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేసుకుంటామని, ఓటీఎస్ చేయని వారి ఇంట్లో పెన్షన్లను నిలిపివేస్తామని నోటీసులిస్తున్నారని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో జగన్ కు ఈ 46 లక్షల పేద కుటుంబాలు ఉద్వాసన పలుకుతాయని జోస్యం చెప్పారు. మాట తప్పితే ప్రాణం తీయాలని అసెంబ్లీ జగన్ అన్నారని, కానీ, ఇపుడు మాట తప్పుతున్నారని గుర్తు చేశారు. ఓటీఎస్ పేరుతో పేదలకు నోటీసులివ్వడాన్ని టీడీపీ ఖండిస్తోందని చెప్పారు.

కాగా, ఓటీఎస్ సెటిల్మెంట్ నేపథ్యంలో వలంటీరుకు ఓ వృద్ధుడు వేసిన ప్రశ్న తాలూకు వీడియో వైరల్ అయింది. ఆల్రెడీ పట్టా ఉన్న ఇంటికి మళ్లీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నా పెళ్లాన్ని మళ్లీ నాకే ఇచ్చి పెళ్లి చేస్తామన్నట్టు’ ప్రభుత్వ తీరు ఉందని ఆయన సెటైర్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.