భారత జట్టు ఈసారి టీ20 ప్రపంచకప్ సెమీస్ కూడా చేరకపోవడం టోర్నీ ముందే కళ తప్పింది. అయినా సరే.. సెమీఫైనల్ మ్యాచ్లు రసవత్తరంగా సాగడంతో మళ్లీ కొంతమేర టోర్నీ మీద ఆసక్తి కలిగింది. కానీ ఫైనల్ ఏకపక్షంగా సాగడంతో ఆసక్తి సన్నగిల్లిపోయింది. మ్యాచ్ చప్పగా మారిపోయింది. ముగింపులో ఉత్కంఠే లేదు. ఏ ఎగ్జైట్మెంట్ లేకుండా ప్రపంచకప్ ముగిసిపోయింది.
2015, 2019 వన్డే ప్రపంచకప్పుల్లో ఫైనల్ దాకా వచ్చి చివరి మెట్టుపై బోల్తా కొట్టినట్లే న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్లోనూ ఫైనల్లో ఓడింది. ఆ జట్టు గెలిస్తే కొంచెం ఎగ్జైటింగ్గా ఉండేదేమో కానీ.. ఆస్ట్రేలియా కప్పు గెలవడం, పైగా మ్యాచ్ ఏకపక్షం కావడంతో ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు క్రికెట్ అభిమానుల్లో. అన్నింటికీ మించి ఈ ప్రపంచకప్కు విలువ లేకుండా చేసి, విజేతకు కూడా పూర్తి ఆనందాన్నివ్వని ఒక విషయం ఉంది. అదే.. టాస్.
టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లే.. ఈ ప్రపంచకప్లో మొదట్నుంచి జరుగుతున్నది ఇదే. ముఖ్యంగా దుబాయ్లో దాదాపు ప్రతి మ్యాచ్ ఇలాగే తయారైంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడం.. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు తడబడటం.. ఆ జట్టు ఎంత లక్ష్యాన్ని నిర్దేశించినా ఛేదనలో జట్టు సులువుగా గెలిచేయడం.. ఇదీ వరస.
ఆరంభంలో బ్యాటింగ్కు ఇబ్బందికరంగా ఉన్న పిచ్.. రాత్రయ్యేసరికి మారిపోతోంది. మంచు ప్రభావంతో బౌలర్లకు బంతి మీద పట్టు చిక్కట్లేదు. పిచ్ కూడా ఆట సాగేకొద్దీ బ్యాటింగ్కు అనుకూలం అవుతోంది. దీని వల్ల రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టే గెలుస్తోంది. కాబట్టి టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా బౌలింగ్ తీసుకోవడం జరిగింది.
భారత జట్టు సెమీస్ చేరకపోవడానికి కూడా ప్రధాన కారణం ఇదే. పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచుల్లో భారత్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్లో ఇబ్బంది పడింది. తర్వాత ప్రత్యర్థి జట్లు అలవోకగా లక్ష్యాన్ని ఛేదించేశాయి. మామూలుగా అయితే దీన్ని సాకుగా చూపించలేం కానీ.. మెజారిటీ మ్యాచుల్లో ఇదే జరిగింది.
సెమీఫైనల్స్, ఫైనల్స్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లోనూ పరిస్థితులు ఇలాగే ఉండటంతో టాస్ గెలవగానే ఆసీస్దే కప్ అన్న భావన వచ్చేసింది. అందుకు తగ్గట్లే 170 ప్లస్ లక్ష్యాన్ని కూడా ఆసీస్ సునాయాసంగా గెలవడంతో వాళ్ల విజయానికి తగ్గిపోయింది. టాస్కు ఇంత ప్రాధాన్యం ఏర్పడితే ఇక ఆటకు విలువేముంటుంది?
This post was last modified on November 15, 2021 11:25 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…