రండి.. ‘బూతుల’ పై చ‌ర్చిద్దాం..

చిత్తూరు జిల్లాలోని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. తాజాగా ఏపీ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కుప్పంలో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఆయ‌న నిప్పులు చెరిగారు. బూతులు ఎవ‌రు మాట్లాడారో.. చ‌ర్చించేందుకు మేం సిద్ధం. నీకు(జ‌గ‌న్‌) ద‌మ్ముంటే.. చ‌ర్చ‌కు రా. నువ్వు చెప్పిన చోట‌కు మ‌మ్మ‌ల్ని ర‌మ్మంటావా? లేక మేం చెప్పిన చోటకు నువ్వు వ‌స్తావా? తేల్చుకో!! అంటూ.. ఆయ‌న స‌వాల్ విసిరారు. పులివెందులైనా.. తాడేప‌ల్లి ప్యాలెస్ అయినా.. అమ‌రావ‌తి అయినా.. కుప్పం అయినా.. చివ‌ర‌కు శ్రీవారం గుడిలో అయినా.. చ‌ర్చ‌కు తాము సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు.

రాష్ట్రంలో వినాశ‌క‌ర పాల‌న సాగుతోంద‌న్న చంద్ర‌బాబు.. ప్ర‌జ‌లు ఇప్ప‌టికేవిసిగిపోయార‌ని.. వైసీపీ ప్ర‌భుత్వ ప‌త‌నం ప్రారంభ‌మైం ద‌ని చెప్పారు. దాడుల‌కు.. వ్యాఖ్య‌ల‌కు.. తాము వ్య‌తిరేక‌మ‌న్నారు. ఒక‌వేళ మేం రాజ‌కీయ బూతులు మాట్లాడి ఉంటే.. క్ష‌మాప‌ణ‌లు కోర‌తాం! అని ప్ర‌క‌టించారు. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ అండ్ కో్.. త‌మ‌పై చేసిన బూతుల‌కు ఏం చెబుతార‌ని నిల‌దీశారు. వైసీపీ ప్ర‌బుత్వంలో ప్ర‌తి ఒక్క‌రూ బిక్కు బిక్కు మంటూ.. ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బ‌తుకుతున్నార‌ని.. చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో అన్ని ధ‌ర‌లు మండిపోతున్నాయ‌ని.. దీనికి తోడు విద్యుత్ చార్జీల‌ను రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా పెంచార‌ని.. చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

జ‌గ‌న్ పాల‌న‌పై మేధావులు కూడా దృష్టి పెట్టాల‌ని.. చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. మేధావుల మౌనం.. రాష్ట్రానికి మంచిదికాద న్నారు. విద్యుత్ చార్జీలు, మ‌ద్యం ధ‌ర‌లు.. నాశిర‌కం మ‌ద్యం విక్ర‌యాలు.. ప్ర‌భుత్వ ఆస్తుల అమ్మ‌కాలు… ఎయిడెడ్ స్కూళ్ల విలీనం వంటి అనేక అంశాల‌పై మేధావులు చ‌ర్చించి.. ఈ ప్ర‌భుత్వానికి బుద్ది చెప్పాల‌ని చంద్ర‌బాబు కోరారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న‌కు ఇటీవ‌ల జ‌రిగిన త‌మ పార్టీపై దాడి ఘ‌ట‌నలే నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. అంతేకాదు.. తాను కుప్పానికి వ‌స్తుంటే.. విద్యుత్ క‌ట్ చేశార‌ని.. ఇది దారుణ‌మ‌ని.. ఒక ప్ర‌తిప‌క్ష నేత‌కు ఈ ప్ర‌భుత్వం ఇచ్చే విలువ ఇదేనా? అని చంద్ర‌బాబు గ‌ద్దించారు.