ఈ దీక్ష‌ల‌తో ఎవ‌రికెంత లాభం?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాలు ఇప్పుడు మంచి కాక మీదున్నాయి. అధికార ప్ర‌తిప‌క్ష నాయ‌కుల ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు.. బూతులు.. తిట్లూ.. పార్టీ కార్యాల‌యాల‌పై దాడులు ఇలా రాష్ట్ర వాతావ‌ర‌ణం వేడెక్కింది. టీడీపీ పార్టీ కార్యాలయాల‌పై వైసీపీ శ్రేణులు దాడి చేశాయంటూ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 36 గంట‌ల దీక్ష‌కు పూనుకున్నారు. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ నాయ‌కులు బూతులు వాడుతూ మాట్లాడ‌టాన్ని నిర‌సిస్తూ వైసీపీ కూడా పోటీగా జనాగ్ర‌హ దీక్ష‌కు శ్రీకారం చుట్టింది. మ‌రీ ఈ పోటాపోటీ దీక్ష‌ల‌తో ఎవ‌రికెంత లాభం? క‌లుగుతుంద‌నే చ‌ర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.

విమ‌ర్శ‌కు ప్ర‌తి విమ‌ర్శ‌.. ఆరోప‌ణ‌కు ప్ర‌త్యారోప‌ణ‌.. దీక్ష‌కు కౌంట‌ర్‌గా దీక్ష‌.. ఇలా రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ త‌మ‌దే స‌రైన విధాన‌మ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. పార్టీ కార్యాల‌యాల‌పై దాడుల‌ను నిర‌సిస్తూ బాబు 36 గంట‌ల దీక్ష‌కు దిగారు. ఈ దీక్ష ద్వారా రాష్ట్రంలో పార్టీ ఉనికిని బ‌లంగా చాట‌డంతో పాటు నాయ‌కులు కార్య‌క‌ర్త‌ల్లో తిరిగి ఉత్సాహం నింపాల‌ని బాబు భావించారు. ఇప్ప‌టికే వైసీపీ ప్ర‌భుత్వానికి రెండున్న‌రేళ్లు పూర్తి కావొస్తోంది.

ఎన్నిక‌ల‌కు మ‌రో రెండున్న‌రేళ్లు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. ఇప్ప‌టినుంచే వ‌చ్చే ఎన్నిక‌ల‌పై దృష్టి సారించిన బాబు.. ఇప్పుడీ దాడుల విష‌యాన్ని ఆ దిశ‌గా అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ఎన్ని కార్య‌క్ర‌మాలు చేసినా పార్టీకి ప్ర‌జ‌ల్లో రావాల్సిన మైలేజీ రావ‌డం లేదు. అందుకే ఇప్పుడు ఈ దాడుల విష‌యంలో అధికార పార్టీని ముఖ్య‌మంత్రిని టార్గెట్ చేయ‌డం బాబు వ్యూహంగా క‌నిపిస్తోంది. ఈ దాడి తర్వాత ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం బాబు చేస్తున్నారు. మ‌రోవైపు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తాన‌ని పేర్కొన‌డం వెన‌క బీజేపీతో పొత్తు కోసం మంత‌నాలు చేయాల‌నే బాబు ప్ర‌ణాళిక ఉన్న‌ట్లు చెబుతున్నారు.

మ‌రోవైపు అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సంక్షేమ ప‌థ‌కాల‌కు పెద్ద పీఠ వేసిన జ‌గ‌న్ స‌ర్కారు ఆ విష‌యంలో ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందుతోంది. కానీ రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ అప్పులు ఇలా మిగ‌తా అంశాల్లో విమ‌ర్శ‌లు ఎదుర్కుంటూనే ఉంది. ఈ అంశాల‌ను ప్ర‌తిప‌క్షం అవ‌కాశంగా తీసుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తోంది. కానీ ఇటీవ‌ల త‌న పంథా మార్చిన వైసీపీ దూకుడు రాజ‌కీయాల‌కు శ్రీకారం చుట్టింది. సీఎం జ‌గ‌న్‌ను ఎవ‌రైన ఏమ‌న్నా అంటే వైసీనీ నేత‌లు అస్స‌లు ఆగ‌ట్లేదు.

ఇక ఇప్పుడేమో జ‌గ‌న్‌ను టీడీపీ నాయ‌కులు బూతులు తిట్టార‌నే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి ఆ పార్టీని మ‌రింత దెబ్బ కొట్టాల‌ని వైసీపీ చూస్తోంది. అందుకే బాబు దీక్ష చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌గానే.. వైసీపీ కూడా జ‌నాగ్ర‌హ దీక్ష పేరుతో ప్ర‌జ‌లే ప్ర‌తిప‌క్షంపై కోపంతో ర‌గిలిపోతున్నార‌నే భావ‌న క‌లిగించే విధంగా వ్య‌వ‌హ‌రించింది. దీంతో ప్ర‌జ‌ల్లో త‌మ పార్టీపై ఆద‌ర‌ణ త‌గ్గ‌లేద‌ని చాటిచెప్పాల‌నే వ్యూహంగా ముందుకు సాగుతోంది.