టీఆర్ఎస్ నేతల్లో పెరిగిపోతున్న టెన్షన్

తెలంగాణా రాష్ట్ర సమితికి గుర్తుల గండం వెంటాడుతోంది. ఎన్నికల్లో టీఆర్ఎస్ గుర్తు కారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కారును పోలిన గుర్తులు ఎన్నికల్లో ఇతర అభ్యర్ధులకు ఎన్నికల కమీషన్ కేటాయించినపుడు టీఆర్ఎస్ నష్టపోయిన విషయంపై తాజాగా చర్చలు జోరందుకుంది. ఇంతకీ విషయం ఏమిటంటే హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులకు రోడ్డు రోలర్, చపాతి రోలర్ గుర్తులను కమీషన్ కేటాయించింది.

స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించిన పై రెండు గుర్తులపై టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇందుకు బలమైన కారణాలే ఉన్నాయని అధికారపార్టీ నేతలు చెబుతున్నారు. భువనగిరి లోక్  సభ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్ పై కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఇండిపెండెంట్ అభ్యర్దిగా పోటీచేసిన వ్యక్తికి ఎన్నికల కమీషన్ రోడ్డురోలర్ గుర్తును కేటాయించారు.

రోడ్డు రోలర్ గుర్తుపై పోటీచేసిన అభ్యర్దికి ఏకంగా 27 వేల ఓట్లు పడ్డాయి. అంటే స్వతంత్ర అభ్యర్ధికి రోడ్డురోలర్ గుర్తు లేకపోతే తమ అభ్యర్ధి తప్పకుండా గెలిచుండే వారని ఇప్పటికీ టీఆర్ఎస్ నేతలు గుర్తు చేసుకుంటుంటారు.

అలాగే దుబ్బాకలో కూడా టీఆర్ఎస్ అభ్యర్ధి సుజాత పై బీజేపీ అభ్యర్ధి రఘునందనరావు 1079 ఓట్ల మెజారిటితో గెలిచారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్ధిని దెబ్బకొట్టింది ఒక ఇండిపెండెంట్ అభ్యర్ధి. ఎలాగంటే సదరు స్వతంత్ర అభ్యర్ధికి 3570 ఓట్లువచ్చాయి. ఇంతకీ ఆ ఇండిపెండెంట్ అభ్యర్ధి గుర్తు ఏమిటంటే చపాతి రోలర్.

ఈ రెండు ఉదాహరణలే కాకుండా మహబూబ్ నగర్ లాంటి నియోజకవర్గాల్లో కూడా జీపు, ట్రాక్టర్ లాంటి గుర్తులపై పోటీచేసిన స్వతంత్ర అభ్యర్ధులకు వచ్చిన ఓట్లకన్నా టీఆర్ఎస్ ఓడిపోయిన ఓట్ల మార్జిన్ తక్కువే అన్న విషయం ఫలితాల్లో బయటపడింది.

అప్పటి నుండి ఎన్నికల్లో స్వతంత్రుల్లో ఎవరికైనా జీపు, ట్రాక్టర్, రోడ్డురోలర్, చపాతి రోలర్ గుర్తులున్నాయంటే టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మరి జరగబోయే ఉపఎన్నికల్లో పై రెండు గుర్తులు టీఆర్ఎస్ అభ్యర్ధి అదృష్టాన్ని ఏమి చేస్తాయో చూడాల్సిందే.