కరోనా టెస్టులపై సుప్రీం కీలక ఆదేశాలు

దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతోన్నాయి. కరోనాను కట్టడి చేయడానికి ఓ వైపు లాక్ డౌన్ విధించడంతో పాటు మరోవైపు అధిక సంఖ్యలో టెస్టులు చేయడమే ఏకైక మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్ లోని చాలా రాష్ట్రాలు రోజుకు 5 నుంచి 10 వేల టెస్టులు చేస్తున్నాయి.

కరోనా రోగులకు చికిత్సను కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే చేస్తున్నారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో కేసుల సంఖ్య పెరిగే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలను, చికిత్సలను ప్రభుత్వ రంగ ఆసుపత్రులకు మాత్రమే పరిమితం చేయడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. కరోనాపైపోరులో ప్రైవేటు రంగంలోని ఆసుపత్రులను రంగంలోకి ఎందుకు దింపడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది.

ప్రైవేటు ఆసుపత్రుల్లోను ఉచితంగా కరోనా పరీక్షలు, చికిత్సలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పూర్తిగా ఉచితంగా లేదా నామమాత్రపు ఫీజులతోను కరోనా పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తామనే వారికి అవకాశం ఇవ్వాలని సూచించింది. ఈ విషయంలో తమ అభిప్రాయాన్ని తెలుపుతూ సమగ్ర నివేదికనివ్వాలని కేంద్రానికి వారం రోజుల గడువునిచ్చింది.

మరోవైపు, కరోనా పరీక్షలపై ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిపల్ అఫ్ మెడికల్ రీసెర్చ్) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షల ధరను నిర్ణయించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గతంలోనే కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్‌ లో కరోనా పరీక్షల నిర్థారణకు ఐసీఎంఆర్ అనుమతినిచ్చింది.

ఒక టెస్టు ధరను రూ. 4500గా నిర్ణయించింది. అయితే, కరోనా వేగంగా వ్యాప్తి చెందడం…కరోనా టెస్టుల సంఖ్య పెరగడంతో టెస్టుల ధర నిర్ణయాన్ని రాష్ట్రాలకు అప్పగించింది. భారత్ లో కోవిడ్-19 టెస్ట్ కిట్లు భారీగా అందుబాటులో ఉండటం, ప్రైవేట్ ల్యాబ్‌ల మధ్య విపరీతమైన పోటీ నేపథ్యంలో ధరలు దిగి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐసీఎంఆర్ ఈ నిర్ణయం తీసుకుంది.

అందుకే, ఇకపై రాష్ట్రాలు, ప్రైవేట్ ల్యాబ్‌లు, సంస్థలు పరస్పర అంగీకారంతో ధర నిర్ణయించుకోవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 428 ప్రభుత్వ ప్రయోగశాలలు, 182 ప్రైవేట్ ల్యాబ్‌లు కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహిస్తున్నాయి.ప్రస్తుతం రోజుకు లక్ష కరోనా పరీక్షలు చేస్తుండగా…ఆ సామర్థ్యాన్ని 2 లక్షల పరీక్షలకు పెంచాలని కేంద్రం భావిస్తోంది.