ఇదే పని మూడు వారాల క్రితం చేసి ఉంటే అదిరిపోయేది బాబు

సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కష్టం వచ్చిన ప్రతిసారీ.. ప్రజల్ని త్యాగం చేయమని చెప్పే ఆయన.. తన తీరుకు భిన్నంగా తొలిసారి ఆయన వినూత్నంగా రియాక్టు అయ్యారు. కరోనా కష్ట కాలంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వినూత్న పద్దతిలో విరాళాన్ని ప్రకటించారు. కుప్పం నియోజకవర్గంలోని వారితో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించిన ఆయన.. నియోకవర్గంలో యుద్ద ప్రాతిపదికన వైద్య సదుపాయాల్ని కల్పించాలని.. అందుకు అవసరమైన మొత్తాన్ని తానే పెట్టుకుంటానని చెప్పటమే కాదు.. రూ.కోటి ఇచ్చేందుకు సిద్దమయ్యారు.

కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.35 లక్షల సొంత నిధులతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించనున్నట్లు ప్రకటించిన ఆయన.. వైద్య సిబ్బంది కొరత తీర్చేందుకు వెంటనే ఆసుపత్రి డెవలప్ మెంట్ కమిటీ ద్వారా సిబ్బంది నియామకాలు చేపట్టాలని కోరారు. కుప్పం ఆసుపత్రి మొదటి అంతస్తులో ఆక్సిజన్ సరఫరాను గ్రౌండ్ ఫ్లోర్ కు చేరేలా వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు.

ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా జరుగుతున్న టెలీ మెడిసిన్.. ఆహార పంపిణీ కార్యక్రమాన్ని మరింత జోరుగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన పల్స్ ఆక్సీమీటర్లను ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న పదకొండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన ఔషధాల వివరాల్ని తెలుసుకొని వెంటనే పంపిణీ చేస్తామని చెప్పారు.

ఇలా తను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఇదంతా బాగానే ఉన్నా.. ఇదే పని మూడు వారాల ముందు చేపట్టి.. ఇలాంటి వసతుల్ని అందుబాటులోకి తెచ్చి ఉంటే.. బాబు చేతల్లో ఎలా పని చేసి చూపిస్తారన్న మాటను మిగిలిన వారికి చూపించే అవకాశాన్ని ఆయన మిస్ అయ్యారని చెప్పాలి. ఏమైనా.. ఇంతకు ముందెప్పుడు ఈ రీతిలో తన నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధను చూపించలేదన్న మాట వినిపిస్తోంది.