మాజీ ఎంపీ సబ్బం హరి పరిస్థితి విషమం

కరోనా వైరస్ చిన్నా పెద్దా.. రాజు పేదా అనే తేడాలేమీ చూడట్లేదు. ఆరోగ్యం కోసం ఎంత డబ్బయినా ఖర్చు పెట్టగల వాళ్లు కూడా వైరస్ ధాటికి నిలవలేకపోయారు. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు కరోనాకు తలవంచాల్సి వచ్చింది. మరెంతో మంది విషమ స్థితిని ఎదుర్కొన్నారు.

తాజాగా ఒక ప్రముఖ రాజకీయ నేత ఆరోగ్యం కరోనా వల్ల విషమించింది. ఆయనే.. మాజీ ఎంపీ, ప్రస్తుత తెలుగుదేశం నేత సబ్బం హరి. ఈ విశాఖ నేత కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు కూడా. తాజాగా సబ్బం హరి పరిస్థితి ఇబ్బందికరంగా తయారవడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు వైద్యులు వెల్లడించారు.

సబ్బం హరి శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆరోగ్యం విషమించినట్లు చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీన సబ్బం హరికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. వైద్యుల సూచన మేరకు మూడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కానీ కోలుకోకపోవడంతో ఆస్పత్రిలో చేరారు. గత మూడు రోజులుగా వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. సబ్బం హరి ఆరోగ్యం విషమించిందని తెలియడంతో ఆయన అనుచరులు,అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఆయన క్షేమంగా ఆసుపత్రి నుంచి బయటికి రావాలని ప్రార్థిస్తున్నారు. హరి 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున అనకాపల్లి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 12,634 కరోనా కేసులు నమోదయ్యాయి. 69 మంది వైరస్‌కు బలయ్యారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 10,33,560కి చేరింది.