అయ్యా సీఎం సార్‌.. జ‌గ‌న్‌కు లోకేష్ లేఖ‌..

జ‌గ‌న్ పేరు వినిపిస్తే.. చాలు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌.. ఏవిధంగా నిప్పులు చెరుగుతారో.. ఎలాంటి విమ‌ర్శ‌లు చేస్తారో.. అంద‌రికీ తెలిసిందే. జ‌గ‌న్‌.. అంటే జే ట్యాక్స్ అని.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం జేసీబీ ప్ర‌భుత్వ‌మ‌ని.. నిన్న మొన్న‌టి తిరుప‌తి ఉప ఎన్నిక ప్ర‌చారంలోనూ విరుచుకుప‌డిన నారా లోకేష్‌.. ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకున్నారా? అన్న‌ట్టుగా మారిపోయారు. సీఎం జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగే లోకేష్ నోటి నుంచి సుతిమెత్త‌ని సూచ‌న‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

అయ్యా సీఎం సార్‌.. అంటూ.. ప్రారంభించిన లోకేష్ లేఖాస్త్రం ఆసాంతం ఎక్క‌డా విమ‌ర్శ‌లు లేవు.. నింద ‌లు అస‌లే లేవు. వాస్త‌వానికి తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో దొంగ ఓట్ల దందా చేయించారంటూ.. అధి కార పార్టీ నేత‌లు, సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ నేత‌లు ఆ చివ‌రి నుంచి ఈ చివ‌రి వ‌ర‌కు తీవ్ర‌స్థాయి విరుచుకుప‌డు న్న స‌మ‌యంలో అనూహ్యంగా లోకేష్‌.. సీఎం జ‌గ‌న్ కు లేఖ సంధించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇటు టీడీపీలోను, అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ‌రి సీఎం జ‌గ‌న్‌కు రాసిన లేఖ‌లో లోకేష్ ఏం పేర్కొన్నారు.. అనేవిష‌యాన్ని ప‌రిశీలిస్తే.. షెడ్యూల్ ప్ర‌కార ‌మే రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు కామ‌న్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని.. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఒక వైపు క‌రోనా కేసులు పెరుగుతున్నా.. ఆస్ప‌త్రుల్లో బెడ్లు కూడా చాల‌క‌.. రోగులు మ‌ర‌ణిస్తున్నా.. విద్యా శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ మాత్రం.. ఎట్టి ప‌రిస్థితిలోనూ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను షెడ్యూల్ ప్ర‌కార‌మే నిర్వ‌హిస్తామ‌ని.. జూన్ తొలి వారంలోనే వీటిని నిర్వ‌హించేందుకు ముహూర్తం పెడతామ‌ని ఇటీవ‌ల కూడా ప్ర‌క‌టించారు.

ఈ క్ర‌మంలో లోకేష్‌.. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌పై వేచి చూసే ధోర‌ణి వ‌ద్ద‌ని.. వీటిని త‌క్ష‌ణ‌మే వాయిదా వేయాల‌ని కోరుతూ.. జ‌గ‌న్‌కు కొన్ని సూచ‌న‌లు చేశారు. “ప‌రీక్ష‌లు రాయాలంటే.. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలి. ఇప్ప‌టికే క‌ర్నూలు.. శ్రీకాకుళం త‌దిత‌ర జిల్లాల్లో పాఠ‌శాల‌ల్లోనూ క‌రోనా వ‌చ్చి.. ఉపాధ్యాయులు కూడా ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో పంతానికి పోయి.. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌వ‌ద్దు. విద్యార్థుల త‌ల్లి దండ్రుల‌కు గ‌ర్భ శోకం మిగ‌ల్చ‌వ‌ద్దు. ఇప్పుడు వాయిదా వేసినంత మాత్రాన పోయేదేం లేదు. ఇత‌ర రాష్ట్రాల్లో ఇప్ప‌టికే వాయిదా వేశారు. కాబ‌ట్టి.. క‌రోనాను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర విద్యార్థుల భ‌విష్య‌త్తు ఆలోచించి.. ఈ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాలి“ అని త‌న లేఖ‌లో జ‌గ‌న్‌కు సూచించారు. ప్ర‌స్తుతం ఈ లేఖ‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. లోకేష్ సూచ‌న‌ల‌పై సోష‌ల్ మీడియా నుంచి మంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.