కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ కూతురు సుస్మిత వివాదాస్పద విమర్శలు చేసిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలిగించడం తెలిసిందే. ఈనెల మొదటి వారంలో ఆమెను బర్త్ రఫ్ చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేబినెట్ హోదా కలిగిన పదవి ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఈ క్రమంలోనే కొండా సురేఖను ఢిల్లీ రావాల్సిందిగా కాంగ్రెస్ పెద్దల నుంచి పిలుపు వచ్చింది.

కొండా సురేఖ వినాయక చవితి పండగ తర్వాత ఢిల్లీ బయలుదేరుతారని ప్రచారం జరుగుతుంది. ఆమెకు ఆర్టీసీ చైర్మన్ గా నియమించాలని అధిష్టానం భావిస్తుంది. అయితే నిన్నా మొన్నటిదాకా మంత్రిగా పని చేసిన కొండా సురేఖ ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్ పదవికి ఓకే చెబుతారో లేదోనన్న గుబులు అధిష్టానాన్ని పీడిస్తుంది. అందుకే తొలుత బుజ్జగింపు కార్యక్రమం పెట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొండా చల్లబడిన తర్వాతే ఆర్టీసీ చైర్మన్ పదవి గురించి ప్రస్థావించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

కొండా సురేఖ ఆలోచనలు మాత్రం వేరుగా వున్నాయి. రెండు దశబ్దాలకు పైగా రాజకీయ రంగంలో వివిధ పదవులను అనుభవించిన ఆమె తన వారసురాలిగా కూతురు సుస్మిత భవిష్యత్ కు ప్రధాన్యత ఇవ్వాలననుకుంటున్నారు. అందుకే కూతురి కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్నారు. అవసరమైతే పార్టీ మారేందుకు కూడా వెనకాడే మనిషి కాదు. దుందుడుకు నిర్ణయాలకు పేరెన్నిక కలిగిన సురేఖ ఈసారి స్టైల్ మార్చారు.

గతంలో చేసినట్లు తొందరపాటు రాజకీయాలు చేయడం లేదు. కొత్తగా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అందుకే ఆమెను బర్తరఫ్ చేసినప్పటికి ఎలాంటి అవేశానికి లోను కాలేదు. మనస్తాపానికి గురైనా పార్టీ అధినాయకత్వం పట్ల విశ్వాసం ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే లక్ష్యమని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం తనపట్ల ఆలోచించేలా చేసుకున్నారు.

నిజానికి ఆమె గత పది రోజుల నుంచి బయటకు రావడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అజ్ఞాతంలో వున్నారు. ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిన తర్వాత ఆదివారం ఆమె బయటకు వచ్చారు. హనుమకొండలోని రాంనగర్ నివాసంలో పార్టీ ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో సమావేశమయ్యారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ కాక పుట్టిస్తున్నాయి. ఢిల్లీ వేదికగా ఏం జరగబోతుందోనని ఎవరికివారు ఆలోచిస్తున్నారు.

ఢిల్లీలో సురేఖ ఎవరెవరితో మాట్లాడబోతున్నారన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నాల్లో తెలంగాణా కాంగ్రెస్ నాయకులు బిజీగా వున్నారు. వేగుల ద్వారా సమాచారం సేకరించేందుకు తంటాలు పడుతున్నారు. ప్రస్తుతానికి అందిన షెడ్యూల్ ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ వంటి పెద్దలతో కలిసి మాట్లాడే అవకాశం వుందని తెలిసింది. దీంతో తదుపరి పరిణామాలు ఏమైనప్పటికీ కొండా వర్గంలో ఉత్సాహం కనిపిస్తుంది.