లోకేశ్‌ ఇలాఖాలో ఈసారైనా ఎన్నికలు ఉంటాయా?

మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎంటీఎంసీ) ఎన్నికలపై ప్రధాన పార్టీల కార్యకర్తల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కార్పొరేషన్‌ ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎన్నికలు జరగకపోవడం, విలీన ప్రక్రియను సవాల్‌ చేస్తూ కోర్టులో కేసులు ఉండటం, ఈసారైనా ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే దానిపై స్పష్టత లేకపోవడంతో కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నట్లు సమాచారం.

2021 మార్చిలో మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాలతోపాటు చుట్టుపక్కల గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థను ఏర్పాటు చేసింది. అయితే కార్పొరేషన్‌ ఏర్పాటు, గ్రామ పంచాయతీల విలీనాన్ని సవాల్‌ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. 

మంగళగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించిన మంత్రి నారా లోకేష్ గత రెండేళ్లలో నియోజకవర్గంపై గట్టిపట్టు సాధించారు. అన్ని వర్గాలతో మమేకం అవుతూ మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు మంగళగిరి తాడేపల్లి ప్రాంతాలలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం చూపారు. వందల మంది నగరవాసులకు ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేశారు. 

ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభిస్తున్న నేపథ్యంలో మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌ ఎన్నికల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. కార్యకర్తలు ఎన్నికలపై స్థానిక నాయకులను ప్రశ్నిస్తున్నా.. స్పష్టమైన సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందని సమాచారం. ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు వస్తుందో తెలియక ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.

ఇప్పటివరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయలేదు. దీంతో ప్రజాప్రతినిధుల పాలనకు బదులుగా అధికారుల ద్వారానే పరిపాలన కొనసాగుతోంది. కోర్టు వ్యవహారాలు, ఎన్నికల ప్రక్రియపై స్పష్టత వచ్చిన తర్వాతే తదుపరి అడుగులు పడే అవకాశం ఉంది.