నాడు చెల్లి.. నేడు మిత్రుడు.. జ‌గ‌న్‌కు సెగ పెంచేస్తున్నారు!

ఏపీ విప‌క్షం(ప్ర‌ధాన కాదు) వైసీపీలో అంత‌ర్గ‌త పోరు ఎక్కువ‌గా సాగుతోంది. దీనికి తోడు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉన్న నాయ‌కులు.. ఇప్పుడు పార్టీపై తిరుగుబాటు జెండా.. అజెండాల‌తో ముందుకు సాగుతున్నారు. ఈ ప‌రిస్థితి వైసీపీకి ముఖ్యంగా జ‌గ‌న్‌కు భారీ ఎత్తున సెగ పెంచుతున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. గ‌తంలో సోద‌రి.. ఇప్పుడు సాయిరెడ్డి వ‌రుస‌గా వైసీపీని ఇర‌కాటంలోకి నెడుతున్నార‌ని అంటున్నారు.

గ‌త 2024 ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా అరంగేట్రం చేసిన జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల‌.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏవిధంగా విజృంభించారో అంద‌రికీ తెలిసిందే. తమ బాబాయి దారుణ హ‌త్య ఉదంతాన్ని.. దీన్ని క‌ప్పిపుచ్చేందుకు జ‌గ‌న్ తీవ్ర‌ప్ర‌య‌త్నాలు చేశార‌ని ఆమె ఆరోపించారు. అదేస‌మ‌యంలో క‌డ‌ప ఎంప అవినాష్ రెడ్డి ఓట‌మి ల‌క్ష్యంగా క‌డ‌ప‌లోనూ రాజ‌కీయాల వేడిని పెంచారు. ఫ‌లితంగా వైసీపీకి భారీ మైన‌స్ వ‌చ్చింది. కేవలం 11 స్థానాల‌కు ప‌రిమితం అయింది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. జ‌గ‌న్ మిత్రుడు, ఆయ‌న‌కు ఆడిట‌ర్‌గా సేవ‌లు అందించి, పార్టీలో కీల‌క రోల్ పోషించిన‌.. సాయిరెడ్డి కూడా ఎగ‌స్పార్టీ అయిపోయారు. న‌న్ను కెలికితే.. మీ గుట్టు బ‌య‌ట పెడ‌తా! అంటూ.. ఆయ‌న హెచ్చ‌రించారు. ఒక‌వైపు వైసీపీ అధినేత జ‌గ‌న్ మంచి వారే అంటున్నా.. సాయి రెడ్డి చేస్తున్న ఇత‌ర వ్యాఖ్య‌లు.. ముఖ్యంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కేంద్రంగా వేస్తున్న అడుగులు వైసీపీని క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌హీన‌ప‌రుస్తున్నాయి.

నిజానికి వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. చాలా మంది నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే.. వైసీపీ అంత‌ర్గ‌త విష‌యాలు.. ముఖ్యంగా జ‌గ‌న్ అంత‌ర్గ‌త విష‌యాల‌పై పూర్తి స‌మాచారం, అవ‌గాహ‌న ఉన్న నాయ‌కులు ఎవ‌రూలేరు. ఇదే సాయిరెడ్డికి క‌ల‌సి వ‌స్తోంది. వైసీపీ గురించి ఆయ‌న‌కు పూర్తిగా తెలుసు. ఇక‌, జ‌గ‌న్ ఆర్థిక సామ్రాజ్య పునాదుల విష‌యాలు కూడా ఆయ‌న‌కు క‌ర‌త‌లామ‌ల‌కం. ఈ నేప‌థ్యంలో నాడు ష‌ర్మిల‌కంటే కూడా ఎక్కువ‌గా సాయిరెడ్డి నోరు తెరిస్తే..వైసీపీ ఇరుకున ప‌డ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో ష‌ర్మిల .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సాయిరెడ్డి ప్ర‌భావం వైసీపీపై ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.