అసెంబ్లీ ఆవరణలో సీపీఆర్ చేసిన మంత్రి కానీ…

వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు…అంటే రోగి ప్రాణాలు కాపాడే వైద్యుడు దేవుడితో సమానం అన్న నానుడిని ఇప్పటికీ చాలామంది వైద్యులు పాటిస్తున్నారు. సినీ, రాజకీయ రంగాల్లో చాలామంది డాక్టర్లు స్థిరపడినప్పటికీ సమయం, సందర్భం వస్తే తమ వైద్యంతో సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తెలంగాణ శాసన సభ సమావేశాల సందర్భంగా ఈ తరహా ఘటన ఒకటి జరిగింది. ఓ పక్క తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న క్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి మానవత్వం చాటుకున్నారు.

అసెంబ్లీ ఆవరణలో ఐఏఎస్ అధికారి నవీన్‌ మిట్టల్‌ పీఎస్‌ రాజు అకస్మాత్తుగా కుప్పకూలారు. వెంటనే మంత్రి శ్రీహరి స్పందించి రాజుకు సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత రాజుకు మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌ లో ఆసుపత్రికి తరలించారు. అయితే, రాజును కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మార్గమధ్యంలో అంబులెన్సులో రాజు తుది శ్వాస విడిచారు.

అయినప్పటికీ, అసెంబ్లీ ఆవరణలో రాజు పరిస్థితి గమనించి వెంటనే రంగంలోకి దిగిన మంత్రి శ్రీహరి తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో వెంటనే స్పందించి సీపీఆర్‌ చేయడాన్ని అభినందిస్తున్నారు. వైద్యులు ఎక్కడున్నా వైద్యులేనని కొనియాడుతున్నారు. రాజు బ్రతికి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. రాజు కుటుంబానికి పలువురు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.