కేసీఆర్ ఫాం హౌస్ దగ్గర హై టెన్షన్

తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాతా మధును పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ ఆ వ్యవహారం సద్దుమణగలేదు. ఈ క్రమంలోనే తాతా మధు వ్యాఖ్యలకు నిరసనగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ ను ముట్టడించేందుకు కాంగ్రెస్ ఎస్సీ సెల్ పిలుపునిచ్చింది. 1000 డప్పులతో కేసీఆర్ ఫాం హౌస్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫాం హౌస్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డారు. ఎర్రవెల్లి పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

ఫామ్‌హౌస్ వైపు వెళ్లే అన్ని ప్రధాన రహదారులను బారికేడ్లతో దిగ్బంధించి పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు, ఎర్రవెల్లిలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ధర్నా శిబిరాన్ని పోలీసులు బలవంతంగా ఎత్తివేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల సవాళ్లతో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలలో పాల్గొంటున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎర్రవల్లి ఫాంహౌస్‌కు బయలుదేరారు.

కేసీఆర్ నివాసానికి వెళ్తున్న కేటీఆర్, హరీశ్ రావు వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, కాలినడకన వారు ఫాం హౌస్ కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకొని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హరీశ్ రావును అరెస్ట్ చేసి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసు ప్రవర్తనను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. నల్గొండ ఎమ్మల్యేలు అసెంబ్లీకి పోకుండా ఫాం హౌస్ కు వెళుతుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రం అరెస్ట్ చేయడం ఏంటని నిలదీశారు. ప్రస్తుతం ఎర్రవెల్లిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.