తెలంగాణలో టీడీపీ బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణలోనూ టీడీపీ కేడర్, లీడర్లు బలంగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీటీడీపీ కాస్త బలహీన పడడం, ఆ క్రమంలో చాలామంది టీడీపీ నేతలు కాంగ్రెస్ లో, ఇతర పార్టీల్లో చేరడంతో టీడీపీ మరింత బలహీనపడిందన్నది వాస్తవం. కానీ, పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. అయితే, అసలు తెలంగాణలో టీడీపీ లేదని అంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
టీడీపీ మొలకెత్తుతదా తెలంగాణలో అని ఆయన ప్రశ్నిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకప్పటి టీడీపీ నేతలంతా కాంగ్రెస్ లో చేరారని చెప్పారు. పచ్చ కాంగ్రెస్ వస్తదా ఇక్కడా అని ప్రశ్నించారు. అంతేకాదు, ఇంకెక్కడి టీడీపీ? తెలంగాణలో టీడీపీ వచ్చేది లేదు సచ్చేది లేదు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక, కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు, వాటి ద్వారా సృష్టించిన ఆస్తుల వివరాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ నేతలకు మహేష్ గౌడ్ సవాల్ విసిరారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయల పేరు చెప్పి వేల కోట్లు ఖర్చు చేసినా ఫలితాలు రాకపోగా, వాటిలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates