కంచుకోట‌లో కొత్త క్యాండెట్‌ను రెడీ చేస్తోన్న జ‌గ‌న్‌..?

రాబోయే ఎన్నికల వ్యూహాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో చేసిన పొర‌పాట్లు పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అభ్యర్థుల గుణగణాల కంటే ఆర్థిక స్తోమతకే పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో, నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఒక బడా కాంట్రాక్టర్‌ను రంగంలోకి దింపాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో క‌ర్నూలు, నంద్యాల రెండు ఎంపీ సీట్లు వైసీపీకి కంచుకోట‌గా ఉంటూ వ‌స్తున్నాయి. నంద్యాల లోక్‌స‌భ ప‌రిధిలో వైసీపీకి తిరుగే ఉండేదే కాదు. అలాంటి చోట గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అనూహ్యంగా ఓడిపోయింది. ఇక తాజాగా జ‌గ‌న్ మ‌దిలో ఉన్న ఆ కాంట్రాక్ట‌ర్ గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలోనూ, ప్ర‌స్తుత ప్ర‌భుత్వంలోనూ .. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వంలోనూ జిల్లాకే చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుతో ఇబ్బందులు ప‌డ్డార‌ట‌. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు తన్ను వేధిస్తున్నారని, రాజకీయంగా బలం సాధిస్తే తప్ప తన వ్యాపారాలకు, ఆధిపత్యానికి తిరుగుండదని ఆయన భావిస్తున్నార‌ట‌.

ఈ నేపథ్యంలోనే ఆయన మాజీ సీఎం జగన్‌తో నిరంతరం చర్చలు జరుపుతున్నారని, జగన్ కూడా ఆయన అభ్యర్థిత్వానికి సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం గతంలో 2014, 2019 ఎన్నికల్లో వైసీపీకి కంచుకోటగా నిలిచింది. రెండు ఎన్నిక‌ల్లోనూ అక్క‌డ నుంచి వైసీపీ ఎంపీలు ఏకంగా ల‌క్ష పై చిలుకు ఓట్ల భారీ మెజార్టీల‌తో విజ‌యం సాధించారు. 2024 ఎన్నికల్లో అక్కడ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శ‌బ‌రి గెలుపొందారు.

గత ఎన్నికల్లో ఓడిపోయిన పోచా బ్రహ్మానందరెడ్డిపై మంచి అభిప్రాయం ఉన్నా.. ఆయన రాజకీయంలో అంత చురుగ్గా ఉండకపోవడం వల్ల ఆయనకు ఇతర మార్గాల్లో న్యాయం చేసి, ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న ఈ బడా కాంట్రాక్టర్‌ను నంద్యాల రేసులో నిలపాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆర్థికంగా సత్తా చాటగల కొత్త ముఖాలకే ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.