వైసీపీ అధినేత జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాది నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కొన్నాళ్ల కిందటే ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించిన జగన్.. పాదయాత్ర తన కోసం కాదని.. అక్కచెల్లెమ్మలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబును నమ్మి అధికారం అప్పగిస్తే.. ఆయన రాష్ట్రాన్ని ప్రైవేటుకు అమ్మేస్తున్నారని విమర్శించారు. కేబినెట్ అంటే.. భూములు అమ్మేయడమేనని.. లేదా ఉచి తంగా ఇచ్చేయడమేనని వ్యాఖ్యానించారు.
తాజాగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వైసీపీ నాయకులతో జగన్ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో వైసీపీ తీరుతెన్నులు తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించారు. ఈ సందర్బంగా జగన్.. మాట్లాడుతూ… పాదయాత్ర వచ్చేఏడాది ప్రారంభం అవుతుందన్నారు. దీనికి ముందు సన్నాహక యాత్రలకు ఎవరైనా సిద్ధపడితే పార్టీ సహకారం తీసుకోవాలని సూచించారు.
నాకోసం కాదు..
“మనం ప్రతి అక్కచెల్లెమ్మకు మేలు చేశాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కూడా అన్నీ ఇచ్చాం. మనకన్నా ఎక్కువ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చాడు. కానీ, అధికారంలోకి వచ్చాక.. తన వారికి ఇచ్చుకుంటున్నాడు. ప్రజల భూములను ప్రైవేటుకు ఇచ్చేస్తున్నాడు. వీటిపై మనం పోరాటం చేయాలి. అందుకే నా పాదయాత్ర. ప్రజల కోసమే నేను ప్రజల మధ్యకు వెళ్తున్నా. వారికి జరిగిన అన్యాయాలను వివరిద్దాం.“ అని జగన్ పిలుపునిచ్చారు. అదేసమయంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కూడా కృషి చేయాలని నాయకులకు దిశానిర్దేశంచేశారు.
పోరు పోరే!
స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కావాలని జగన్ పిలుపునిచ్చారు . గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఎక్కడా వెనుకడుగు వేయద్దన్నారు. కేసులు పెడతారు.. కొడతారు.. అయినా భరిద్దాం. కానీ, గెలుపు మాత్రం వైసీపీకి దక్కాల్సిందే నన్నారు. ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కేసులకు భయపడేవారు ఉంటే తనకు ముందే చెప్పాలని సూచించారు. ఎక్కడా ఏకగ్రీవాలు కాకుండా చూడాలని కోరారు. అంతేకాదు.. వైసీపీ తరఫున బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates