మళ్ళీ హద్దు మీరిన అంబటి

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నారని చెప్పాలి. ఇదివరకే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అంబటి… పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా రేగిన అలజడులతోనే ఆయన ఇంటిపైనా దాది జరిగింది. అంబటి అరెస్టు కూడా అయ్యారు. అయినా గానీ అంబటిలో ఏమాత్రం మార్పు రాలేదని చెప్పాలి. తాజాగా శుక్రవారం కూడా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి మరోమారు హద్దు దాటారని చెప్పక తప్పతు.

ఏపీలో కూటమి పాలనకు శుక్రవారంతో రెండేళ్లు పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూటమి పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను అటకెక్కించాయని ఆరోపిస్తున్న వైసీపీ… వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట ప్రత్యేక నిరసనలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలు ఏపీ వ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ జరిగాయి. వాటిలో భాగంగా గుంటూరులో జరిగిన నిరసనలో పాలుపంచుకున్న అంబటి… మరోమారు చంద్రబాబుపై నోరు పారేసుకున్నారు.

చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన అంబటి.. “వాడిని ఎప్పుడో తగలేశారు” అని అనుచిత వ్యాఖ్య చేశారు. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబును కనీసం ఆయన వయసు చూసి అయినా గౌరవించాల్సిందే. అయితే అటు హోదా, ఇటు వయసును ఏమాత్రం పట్టించుకోని అంబటి… చంద్రబాబును ఏకంగా వాడు అంటూ సంబోధించి కలకలమే రేపారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు టీడీపీ నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అదికారిక హోదాలు, వయసు అంశాలనే మరిచిన అంబటి.. తన తీరు మార్చుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురు కాక తప్పదన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే… అంబటి బయటకు వచ్చారంటే శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో నిమగ్నమై ఉండే పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు బయటకు వచ్చినా అంబటి చేసే హైడ్రామాతో పోలీసులు తలలు పట్టుకునే పరిస్థితి. తాజాగా శుక్రవారం నాటి వైసీపీ నిరసనలోనూ అంబటి అదే తరహా వైఖరితో ముందుకు సాగారు. నిరసనల్లో పాలుపంచుకునే క్రమంలో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సరైన కారణం లేకుండానే అంబటి తమతో వాదనకు దిగుతున్నతీరుపై పోలీసులు కూడా గుర్రుగా ఉన్నారు.