భూ మాఫియా కోరలు తీశాం: చంద్ర‌బాబు

వైసీపీ హ‌యాంలో చెల‌రేగిపోయిన భూ మాఫియా కోర‌లు పీకామ‌ని.. ఇప్పుడు ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా ఉన్నారని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని సిద్ధాంతంలో సోమ‌వారం ప‌ర్య‌టించిన సీఎం మీ భూమి-మీ హ‌క్కు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రైతుల‌తో ఆయ‌న ముఖాముఖి మాట్లాడారు. వారికి భూమి హ‌క్కు ప‌త్రాల‌ను అందించారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ బొమ్మ‌తో కూడిన పాస్ పుస్త‌కాలు అందించిన విష‌యం తెలిసిందే.

వీటిని ర‌ద్దు చేసిన ప్ర‌స్తుత ప్ర‌భుత్వం.. జ‌గ‌న్ బొమ్మ‌ల స్థానంలో ప్ర‌భుత్వ రాజ‌ముద్ర‌తో కూడిన పాస్ పుస్త‌కాల‌ను రైతుల‌కు అందించింది. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. రైతుల‌కు క్యూఆర్ కోడ్ తో కూడిన పాస్ పుస్త‌కాల‌ను అందిస్తున్నామ‌న్నారు. దీనివ‌ల్ల ట్యాంప‌ర్ చేసేందుకు.. భూములు దోచేసేందుకు అవ‌కాశం ఉండ‌ద‌ని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వంలో భూముల కోసం చెల‌రేగి పోయార‌ని విమ‌ర్శించారు.

త‌మ‌కు భూములు ఇవ్వ‌ని వారిని ఎంచుకుని మ‌రీ.. ఏ22లో(నిషేధిత‌) చేర్చార‌ని చంద్ర‌బాబు తెలిపారు. అయితే.. తాము వ‌చ్చిన త‌ర్వాత‌.. స‌ద‌రు భూముల‌ను ఏ22 నుంచి తొల‌గించి అర్హులైన వారికి ప‌ట్టాల‌ను అందిస్తున్నామ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వంలో అంద‌రి భూముల‌ను తారుమారు చేశార‌ని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువ‌చ్చి.. రైతుల గుండెల‌ను చెద‌ర‌గొట్టార‌ని.. వ్యాఖ్యానించారు. మీ పాస్ పుస్త‌కాల‌పై సైకో ఫొటోలు వేయించుకున్నారు అని జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ప్ర‌స్తుతం ఇస్తున్న ప‌ట్టాల‌పై ప్ర‌భుత్వ రాజ‌ముద్ర మాత్ర‌మే ఉంటుంద‌న్నారు. 6 వేల గ్రామాల్లో స‌ర్వే నిర్వ‌హించి.. రైతుల‌కు మేలు చేస్తున్నామ‌న్నారు. జ‌గ‌న్ హ‌యాంలో చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్ద‌డానికి ఇంత స‌మ‌యం ప‌ట్టింద‌న్నారు. 2019-24 మ‌ధ్య దుర్మార్గుడు పాలించాడ‌ని.. సైకో పాల‌న‌లో అంద‌రూ బాధితులేన‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జాధ‌నం 800 కోట్ల రూపాయ‌లు విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేసి రాళ్ల‌పై బొమ్మ‌లు వేయించుకున్నాడ‌ని తెలిపారు. 26 ల‌క్ష‌ల మందికి కూట‌మి ప్ర‌భుత్వం మేలు చేసింద‌ని చెప్పారు. ప‌దే ప‌దే ప్ర‌భుత్వాల‌ను మార్చే సంస్కృతిని వ‌దిలి పెట్టాల‌ని సుస్థిర‌మైన ప్ర‌భుత్వం కొన‌సాగితే.. అభివృద్ధి కొన‌సాగుతుంద‌న్నారు.