తెలంగాణ రక్షణ సేన(టీఆర్ ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గతంలోను.. ఇప్పుడు కూడా కేటీఆర్ పాలనే సాగుతోందని అన్నారు. దీంతో ప్రజలకు మేలు జరగడం లేదని.. పెద్దలే గద్దలుగా మారి.. ప్రజల ధనాన్ని, ఆస్తులను కూడా పోగేసుకుంటున్నారని చెప్పారు. నాడు కేసీఆర్ హయాంలో కేటీఆర్ పాలన కారణంగానే.. ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారని తెలిపారు. ఇప్పుడు కూడా అదే కేటీఆర్ పాలన జరుగుతోందన్నారు.
అయితే.. కేటీఆర్ అంటే కవిత రెండురకాల అర్ధాలు చెప్పడం గమనార్హం. కేసీఆర్ పాలనలో కే- అంటే కేసీఆర్, టీ- అంటే తన్నీరు హరీష్రావు, ఆర్- అంటే కేటీఆర్ అని వ్యాఖ్యానించారు. సర్వం కేటీఆర్ పాలనే అప్పుడు కూడా జరిగిందన్నారు. ఇక, ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో కే-అంటే.. కొండల్ రెడ్డి, టీ-అంటే తిరుమల్ రెడ్డి, ఆర్ – అంటే రేవంత్ రెడ్డి అంటూ.. వ్యాఖ్యానించారు. ఈ పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
హైడ్రా ఉన్నది ఎందకంటే.. పేదలను కొట్టి పెద్దలకు పెట్టేందుకేనని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను పేదల నుంచి లాక్కుని పెద్దలకు దోచి పెడుతున్నారని ఆమె విమర్శించారు. దీనిని ప్రశ్నిస్తే కూడా కేసులు పెట్టుడుతున్నారన్నారు. పేదల భూములను దోచుకునే వారిలో సీఎం కుటుంబ సభ్యులే ఉన్నారని.. దీంతో ఎవరూ నోరు విప్పడం లేదని చెప్పారు. తలా కొంత చప్పున పంచుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.
పవన్కు ఏం పని?
తెలంగాణలో జనసేనకు ఏం పని అని కవిత ప్రశ్నించారు. జనసేన ఏపీలో రాజకీయాలు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. మేమన్నా.. ఏపీలోకి అడుగుపెడుతున్నమా.? ఆయనకు ఇక్కడ ఏం పని? అని ప్రశ్నించారు. తెలంగాణ పూర్తిగా ఇక్కడి ప్రజల జాగీరేనని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ జాగీరు ఏమైనా ఉంటే.. ఏపీలో ఉంటుందని తెలంగాణలో కాదని అన్నారు. తెలంగాణ ప్రజలను ఇంకా అణిచివేయాలని ఆధిపత్యం చలాయించాలని ఏపీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates