పీఏ అక్ర‌మాలు… గట్టిగా వినిపిస్తున్న జగన్ పేరు

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు.. రాష్ట్రంలో జ‌రిగిన అనేక అక్ర‌మాల‌పై ప్ర‌స్తుత ప్ర‌భుత్వం విచార‌ణ చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో ప్ర‌ధానంగా 3500 కోట్ల రూపాయ‌ల మేర‌కు దోచేశార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అక్ర‌మ మ‌ద్యం వ్య‌వ‌హారం మ‌రోసారి దుమారం రేపుతోంది.

ఈ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టికే ప‌లువురిని అరెస్టు చేసిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు.. తాజాగా అప్ప‌టి ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కు ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌గా వ్య‌వ‌హ‌రించిన కె.నాగేశ్వ‌ర‌రెడ్డి(కేఎన్ ఆర్‌) ను విచారిస్తోంది. ఇప్ప‌టికే.. కేఎన్ ఆర్‌ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేప‌ట్టారు.

ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌ప్ర‌మేయం లేకుండా ఆయ‌న పీఏ ఇంత వ్య‌వ‌హారం న‌డిపిస్తాడా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఈ కోణంలోనే అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. జ‌గ‌న్‌కు చేరిన కోట్లెన్ని అనే విష‌యంపై ఆరా తీస్తున్నారు. అయితే.. నేరుగా జ‌గ‌న్ పేరును ఎక్క‌డా ప్ర‌స్తావించ‌ని అధికారులు పెద్ద‌ల‌కు చేరిన న‌గ‌దుపైనే ఆరా తీస్తున్నామ‌ని చెబుతున్నారు.

ఒకప్పుడు కేవలం కొద్దిపాటి జీతానికి పని చేసిన కేఎన్ఆర్.. ఇప్పుడు వందల కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను పోగేసుకోవ‌డంతోపాటు.. జ‌గ‌న్ ఇంటికి స‌మీపంలోనే ఇల్లు నిర్మించ‌డం కూడా అవినీతికి ప‌రాకాష్ఠ‌గా మారింది.

ఇక్క తాడేప‌ల్లిలోనే కాకుండా.. తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఖరీదైన భూములు, షాపింగ్ మాల్స్‌లో కేఎన్ ఆర్‌కు వాటాలు ఉన్నాయ‌ని అధికారులు గుర్తించారు.

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అక్ర‌మ‌ మద్యం కుంభ‌కోణం వ్య‌వ‌హారంలో కేఎన్ ఆర్ పాత్ర కూడా ఉంద‌ని గుర్తించిన అధికారులు ఇప్ప‌టికే సేక‌రించిన సాక్ష్యాల ఆధారంగా.. వ్యాపారుల నుంచి సేకరించిన లంచాలు ఈ ఆస్తుల రూపంలోకి మారాయని భావిస్తున్నారు. అయితే.. వీటిలో కొన్ని ఆస్తుల‌కు బినామీగా ఆయ‌న ఉన్నార‌ని గుర్తించారు.

ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌కు తెలియ‌కుండానే కేఎన్ ఆర్ చేయ‌గ‌ల‌డా? అస‌లు ఆ బినామీగా ఎవ‌రికి వ్య‌వ‌హ‌రించారు? అనే కోణంలో లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. జగన్ పక్కనే పదేళ్ల పాటు ఉంటూ, ఆయన ప్రతి అడుగును గమనించిన కేఎన్ ఆర్‌.. వేల కోట్లను పోగేయ‌డం అంటే.. అంతా జ‌గ‌న్‌కు తెలిసే జ‌రిగింద‌న్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది.

ఈ క్ర‌మంలోనే తాజాగా టీడీపీ నాయ‌కులు స్పందిస్తూ.. జ‌గ‌న్‌కు చేరిన కోట్లెన్ని అని ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. కేఎన్ఆర్ కేవలం ఒక ఫ్రంట్ మ్యాన్ మాత్రమే. అసలు లబ్ధిదారు జగనే అని టీడీపీ సీనియ‌ర్ నేత విమ‌ర్శ‌లు గుప్పించడం గ‌మ‌నార్హం.