సోషల్ మీడియా ఇప్పుడు ప్రజలకు అత్యంత చేరువైన మాధ్యమం. ప్రధాన మీడియా కంటే కూడా.. ప్రజల చేతిలో పాశుపతాస్త్రంగా మారిన ఈ మీడియా.. చేస్తున్న పనులు ఇటీవల కాలంలో తీవ్ర వివాదాలకు దారితీస్తున్నాయి. అదిగో పులి.. ఇదిగో తోక టైపులో సోషల్ మీడియా చేస్తున్న హడావుడి.. అన్ని వర్గాలకు ఇబ్బందిగానే మారింది. తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో చేసిన హడావుడి.. సర్వత్రా విస్మయాన్ని కలిగించింది.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షాను కలుసుకున్నారని.. వైసీపీ అధినేత జగన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారని ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడం.. ఇది పెను రాజకీయ దుమారానికి దారితీయడం తెలిసిందే. ఈ క్రమంలో జనసేన పార్టీ నాయకులు కొందరు ఏపీలోని పలు జిల్లాల్లో నాగేశ్వర్పై కేసులు పెట్టడం వరకు నిజమే. అయితే.. వీటిపై అధికారులు కేసులు కట్టడం కానీ.. ఎఫ్ ఐఆర్లు నమోదు చేయడం కానీ చేయలేదు.
కానీ.. మంగళవారం సాయంత్రం మాత్రం ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఇంకేముంది.. ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్కు చేరుకున్నారని.. ఈ క్షణమో.. మరుక్షణమో ఆయనను అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. అంతే.. ఈ వ్యవహారం హాట్ హాట్గా మారింది. దీనిపై ఒకవైపు చర్చ జరుగుతున్న సమయంలోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ స్వయంగా వివరణ ఇచ్చే వరకు సర్దుమణగకపోవడం గమనార్హం.
తనకు ఎవరూ నోటీసులు ఇవ్వలేదని ప్రొఫెసర్ చెప్పారు. అంతేకాదు… తనను అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చారన్న వాదనలోనూ పసలేదని చెప్పారు. మరోవైపు.. ఏపీ ప్రభుత్వం కూడా.. దీనిపై ప్రకటన చేసింది.
ప్రొఫెసర్ నాగేశ్వర్పై ఫిర్యాదులు మాత్రమే పోలీసులకు వచ్చాయని.. వాటిపై ఎలాంటి ఎఫ్ ఐఆర్ లు కట్టలేదని స్పష్టం చేసింది. దీంతో ఈ చర్చకు తెరపడింది. కానీ.. ప్రజలకు చేరువైన సోషల్ మీడియాలో ఇలా పసలేని వార్తలు.. ప్రచారం కావడంతో విశ్వసనీయతపై పెద్ద ప్రభావమే పడింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates