పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రస్తుతం తుఫాను ముందు ప్రశాంతతగా ఉంది. కాల్పుల విరమణ పాటిస్తు న్నప్పటికీ.. ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ తాజాగా చేసిన హెచ్చరిక తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు బలమైన ప్రతిదాడులు చేస్తూనే.. ఇరాన్.. తన పరిధిలోని హార్ముజ్ జలసంధిపై పట్టు బిగించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ప్రస్తుతం భారత్ కూడా పొదుపు మంత్రం పాటించడానికి ఇదే కారణమనే విషయం తెలిసిందే.
ఇక, తాజాగా ఇరాన్ మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. తన పరిధిలోని హార్ముజ్ జలసంధిలో సముద్ర గర్భంపైనా ఇరాన్ తన నియంత్రణను పాటించాలని నిర్ణయించింది. తద్వారా.. ఇంటర్నెట్, డేటా కేబుళ్లపై ఆధిపత్యం సాధించాల ని భావిస్తోంది. ఇదే జరిగితే.. ఇరాన్ పరిధిలోని సముద్ర గర్భం గుండా ప్రయాణించే కేబుళ్లపై నియంత్రణ మొదలవుతుంది. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి సంస్థలు ఈ పరిధిలో యూరప్-ఆసియా-గల్ఫ్ దేశాలను అనుసంధానం చేస్తూ.. కేబుళ్లను ఏర్పాటు చేశాయి. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది.
ఇప్పుడు ఇరాన్ కనుక కేబుళ్లకు అంతరాయం కలిగిస్తే..(కలిగిస్తామని చెబుతోంది) డేటాకు, నెట్కు కూడా తీవ్ర అంతరాయాలు ఏర్పడతాయి. తద్వారా బ్యాంకింగ్ రంగంపై ప్రభావం పడనుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్ కూడా ప్రభావితం కానుంది. అలానే.. సామాజిక మాధ్యమాలు.. ఆర్థికరంగం కూడా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇరాన్ తన దూకుడును పెంచేందుకు నిర్దిష్ట సమయం ప్రకటించకపోయినా.. అమెరికా చర్యలపై ఆధారపడి నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఈ వ్యవహారంపై భారత్ తక్షణమే జోక్యం చేసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.
ఇక, రెండో విషయం.. డాలర్తో రూపాయి మారకం విలువ. గత నాలుగు రోజులుగా డాలర్తో రూపాయి మారకం విలువ గణనీయంగా తగ్గిపోతోంది. తాజాగా సోమవారం 96.60 రూపాయలకు చేరుకుంది. అంటే ఒక డాలర్కు దాదాపు 97 రూపాయలను వెచ్చించే పరిస్థితి వచ్చింది. మరి కొద్ది రోజుల్లోనే ఇది రూ.100కుచేరే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదే జరిగితే.. దేశంలో ఎంత పొదుపు మంత్రం పఠించినా.. ప్రయోజనం ఉండదని.. ఆర్థిక వ్యవస్థలు సహా.. సాధారణ జన జీవనం కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు విషయాలను భారత్ తక్షణమే పట్టించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates