చంద్ర‌బాబు `ఈవీ` మంత్రం..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌మ‌స్య‌ల‌ను త‌న‌దైన శైలిలో అర్థం చేసుకోవ‌డంతోపాటు.. వాటికి ప‌రిష్కారాల‌ను కూడా త‌న‌దైన శైలిలోనే చూపిస్తారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇంధ‌న స‌మ‌స్య పెరిగిపోయింది. దీంతో ఇంధన‌పొదుపు కోసం ముఖ్య‌మంత్రుల నుంచి మంత్రుల వ‌ర‌కు పొదుపు బాట ప‌డుతున్నారు. తాజాగా సిక్కిం రాష్ట్ర ముఖ్య‌మంత్రి త‌న కార్యాల‌యానికి చేరుకునేందుకు రెండు కిలో మీట‌ర్లు న‌డిచి వ‌చ్చారు. త‌ద్వారా.. 50-60 లీట‌ర్ల డీజిల్‌ను పొదుపు చేసినట్టు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం పేర్కొంది. ఇలా.. దేశ‌వ్యాప్తంగా పొదుపు మంత్రం పాటిస్తున్నారు.

కాగా.. ఏపీలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఒక‌వైపు పొదుపు పాటిస్తూనే మ‌రోవైపు ప్ర‌త్యామ్నాయాల‌పై దృష్టి పెట్టారు. ఇంధన పొదుపు కోసం చేపట్టే కార్యాచరణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖ‌ల అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఉద్యమంగా మార్చేలా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈవీ సైకిళ్లు, ఈవీ వాహనాల ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈవీ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మొత్తం 16 వేల ఎలక్ట్రిక్ సైకిళ్లను ఆయా కార్యాలయాల సిబ్బందికి అందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఈవీ వాహనాలను సులభంగా కొనుగోలు చేసేలా రుణాలను అందించే ప్రయత్నం చేయాలని.. దీనికోసం ఓ ప్రత్యేక ఎస్పీవీ(స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్‌)ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అవ‌స‌ర‌మైతే.. బ్యాంకుల‌తో మాట్లాడి రుణాలు ఇప్పించేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ఈఎంఐ విధానంలో ఈవీ సైకిళ్లను ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఛార్జింగ్ స్టేషన్ల లాంటి మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. అలానే.. మౌలికసదుపాయాల కల్పించటంపై ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. త‌ద్వారా రాష్ట్రంలో ఇంధ‌న వినియోగం త‌గ్గ‌డంతోపాటు.. ప‌ర్యావ‌ర‌ణ అనుకూల వాహ‌నాల వినియోగం కూడా పెరుగుతుంద‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు.