‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’

తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం దశాబ్దాల కాలంగా ఉన్న డీఎంకే కాంగ్రెస్ బంధంలో చిచ్చు పెట్టింది. ఈ పరిణామంపై డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై ఘాటుగా స్పందిస్తూ..”వెన్నుపోటు” అంటూ ఒక షాకింగ్ ట్వీట్ వేశారు. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది అనేలా ఈ ట్వీట్ ఉన్నట్లు మిగతా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

డీఎంకే అండతోనే కాంగ్రెస్ ఐదు సీట్లు గెలుచుకోగలిగిందని, లేదంటే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చేది కాదని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. నిజానికి గత ఎన్నికల సమయంలోనే అధికారం పంచుకోవాలనే విషయంలో డీఎంకే, కాంగ్రెస్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇప్పుడు విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకుందని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు.

సిద్ధాంతపరంగా ఏర్పడిన ‘ఇండియా’ కూటమికి ఇది వ్యతిరేకమని, కేవలం రెండు మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణమని వారు మండిపడుతున్నారు. దశాబ్దాల స్నేహాన్ని కాదని కొత్తగా వచ్చిన పార్టీతో జతకట్టడం వెనుక కాంగ్రెస్ స్వార్థం కనిపిస్తోందని డీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు విజయ్ పార్టీ బీజేపీకి దగ్గరగా ఉందనే అనుమానాలను కూడా డీఎంకే లేవనెత్తింది. విజయ్ తన గెలుపు తర్వాత మొదటి కృతజ్ఞతలు ప్రజలకు కాకుండా ప్రధాని మోదీకి చెప్పారని శరవణన్ గుర్తు చేశారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తికి రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సిద్ధాంతాల ప్రాతిపదికన ఏర్పడిన కూటమిలో ఉంటూ, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ నమ్మకాన్ని కోల్పోతోందని డీఎంకే తీవ్రంగా విమర్శిస్తోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ నిర్ణయం వల్ల 108 సీట్లు ఉన్న విజయ్ పార్టీకి మేజిక్ ఫిగర్ అందుకోవడం సులభం కానుంది.

అయితే దీనివల్ల డీఎంకేతో ఉన్న పాత బంధం తెగిపోయినట్లేనని రాజకీయ అందరూ భావిస్తున్నారు. కాంగ్రెస్ తన మద్దతును సమర్థించుకుంటున్నా, డీఎంకే మాత్రం దీన్ని ఒక పెద్ద మోసంగానే చూస్తోంది. తమ బలంతో గెలిచిన పార్టీ, ఇప్పుడు తమ ప్రత్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. మరి తమిళ రాజకీయాల్లో ఈ ‘వెన్నుపోటు’ రాజకీయం ఎటు దారితీస్తుందో చూడాలి.