మారుమోగుతున్న ఏపీ సర్కారీ బడుల సత్తా

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. రెండు రోజుల క్రితం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సర్కారీ బడులకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. ఈ విషయాన్ని శుక్రవారం వార్తా పత్రికల్లో ఫుల్ పేజీల మేర అడ్వర్టైజ్ మెంట్లను జారీ చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా టీవీల్లోనూ ఆకట్టుకునే యాడ్స్ ను జారీ చేసింది.

ఈ ప్రకటనలను చూస్తుంటే… నిన్నటిదాకా కార్పొరేట్ పాఠశాలలు జారీ చేసిన వాణిజ్య ప్రకటనలు గుర్తుకు వస్తున్నాయి. అంతేకాకుండా… కార్పొరేట్ ప్రకటనల కంటే కూడా సర్కారీ బడుల ప్రకటనలు ఆసక్తికరంగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

గురువారం విడుదలైన ఏపీ పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. మొత్తం 600 మార్కులకు గాను సర్కారీ బడుల్లో చదివిన విద్యార్థుల్లో 13 మంది విద్యార్థులు 595 మార్కులకు పైగా సాధించారు. అంతేకాకుండా 590 మార్కులకు పైగా సాధించిన సర్కారీ విద్యార్థులు ఏకంగా 200 మంది ఉన్నారు.

ఈ మేర అద్భుతమైన ఫలితాలు రావడానికి విద్యా శాఖ అమలు చేసిన వంద రోజుల యాక్షన్ ప్లాన్, నిబద్ధతతో పనిచేసిన ఉపాధ్యాయులే కారణమని చెప్పాలి. అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకున్న సర్కారీ బడుల విద్యార్థులు సత్తా చాటారని చెప్పాలి.

ఇవే విషయాలను ప్రస్తావిస్తూ ఏపీలోని కూటమి ప్రభుత్వం వాణిజ్య ప్రకటనలను రూపొందించింది. శుక్రవారం నాటి వార్తా పత్రికలకు ఇచ్చిన యాడ్స్ లో 595కి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫొటోలను ముద్రించిన తీరు ఆసక్తి రేకెత్తించింది.

తాజాగా టీవీలకు ఇచ్చిన యాడ్స్ లో ఆయా విద్యార్థుల ఫొటోలతో పాటుగా కార్పొరేట్ యాడ్స్ ను తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని వివరించింది. అంతేకాకుండా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సత్తా చాటుతున్న సర్కారీ బడుల్లో మీ పిల్లలను చేర్పించండి అంటూ ఏపీ ప్రజలకు విద్యా శాఖ పిలుపునిచ్చిన తీరు మరింతగా ఆసక్తి రేకెత్తిస్తోంది.