మోదీ vs దీదీ – బెంగాల్ పీఠం ఎవరిది? ఎగ్సిట్ పోల్స్ వచ్చేశాయి…

దీదీనా-మోదీనా నినాదంతో జ‌రిగిన ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో మోదీదే పైచేయి అని బీజేపీనే విజ‌యం ద‌క్కించు కుంటుంద‌ని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. తాజాగా ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల రెండో ద‌శ‌(తుది ద‌శ‌) పోలింగ్ బుధ‌వారం సాయంత్రం 5 గంట‌ల‌కు ముగిసింది. ఆ వెంట‌నే ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. దాదాపు మెజారిటీ పోల్ స‌ర్వేల‌న్నీ.. బీజేపీ వైపే మొగ్గు చూప‌డం విశేషం. ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని నాలుగు విధాలుగా వ‌డ‌పోసిన‌ట్టుప‌లు ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు తెలిపాయి.

అయితే.. నెక్ టు నెక్ అన్న‌ట్టుగా ప‌శ్చిమ బెంగాల్ లో ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని స‌ర్వేలు తేల్చి చెప్పాయి. ప్ర‌ధాని మోదీ వైపే మెజారిటీ ప్ర‌జ‌లు మొగ్గు చూపిన‌ట్టు వివ‌రించాయి. అయితే.. బీజేపీ ప్ర‌భావం గ‌త ఎన్నిక‌ల కంటే కూడా.. తాజా ఎన్నిక‌ల్లో అనూహ్యంగా పెరిగిన‌ట్టు స్ప‌ష్టం చేశాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల చాణ‌క్యంతోపాటు.. రాష్ట్రంలో కీల‌క నేత‌గా ఉన్న సువేందు అధికారి ఐకాన్ నాయ‌కుడిగా నిలిచార‌ని చెప్పారు. వీరి ప్ర‌య‌త్నాల‌తో బీజేపీ భారీ ఎత్తున పుంజుకుంద‌న్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను దూసుకురావ‌డంలో వీరు బాగానే శ్ర‌మించార‌ని.. మ‌మ‌త సానుభూతి ప‌వ‌నాలు త‌గ్గాయ‌ని పేర్కొన్నాయి.

ఇక‌, కాంగ్రెస్ స‌హా.. గ‌తంలో 35 ఏళ్ల‌పాటు బెంగాల్‌ను పాలించిన క‌మ్యూనిస్టులు ఫేడ్ అవుట్ అయిపోయాయ‌ని స‌ర్వేలు స్ప‌ష్టం చేశాయి. తాజాగా ఎగ్జిట్ పోల్స్‌లో ప్ర‌ధాన పోరు బీజేపీ వ‌ర్సెస్ తృణ‌మూల్‌, మోడీ వ‌ర్సెస్ దీదీ అన్న‌ట్టుగానే సాగింద‌ని పేర్కొన్నాయి. మొత్తం 294 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న ప‌శ్చిమ బెంగాల్‌లో రెండు ద‌శ‌ల్లో పోలింగ్ నిర్వ‌హించారు.

ఈ నెల 23న తొలి ద‌శ‌, 29(బుధ‌వారం) తుది ద‌శ పోలింగ్ జ‌రిగింది. ఈ రెండు ద‌శ‌ల‌ను బీజేపీ, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. తుది ద‌శ‌లో ప‌లు చోట్ల ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయి. కేంద్ర బ‌ల‌గాల‌ను భారీ సంఖ్య‌లో మోహ‌రించారు. కొన్ని పోలింగ్ స్టేష‌న్ల వ‌ద్ద ఓట‌ర్ల కంటే ఎక్కువ‌గా కేంద్ర బ‌ల‌గానే క‌నిపించాయ‌ని స్థానిక మీడియా వెల్ల‌డించింది.

ఇదీ.. ఎగ్జిట్ పోల్ ఫ‌లితం..

మ్యాట్రిజ్ సర్వే: తృణ‌మూల్ కాంగ్రెస్: 125- 140, బీజేపీ: 146-161 (బీజేపీ గెలిచే ఛాన్స్‌)

చాణ‌క్య స్ట్రాట‌జీ: తృణ‌మూల్ కాంగ్రెస్: 130- 140, బీజేపీ: 150-160 (బీజేపీ గెలిచే ఛాన్స్‌)

ప్ర‌జా పోల్‌: తృణ‌మూల్ కాంగ్రెస్: 85- 110, బీజేపీ: 178-208 (బీజేపీ గెలిచే ఛాన్స్‌)

ఎస్ ఏ ఎస్‌ గ్రూప్‌: తృణ‌మూల్ కాంగ్రెస్: 170-190, బీజేపీ: 120-130(తృణ‌మూల్ గెలుపున‌కు అవ‌కాశం).