బాబు కృషి… అంతర్జాతీయ `టెక్ మ్యాప్`లో విశాఖ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కృషి ఫలించింది. అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. విశాఖ న‌గ‌రం అంత‌ర్జాతీయ టెక్ మ్యాప్‌లో చేర‌నుంది. అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో దేశ టెక్నాలజీ రంగంలో ఓ కొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది. ఆసియా ఖండానికే ఓ కీలకమైన ఏఐ గేట్ వేగా విశాఖ అవతరించనుంది. అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖ నగరం శాశ్వతంగా చోటు ద‌క్కించుకోనుంది.

15 బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డితో..

15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్న గూగుల్ … దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా రికార్డు సృష్టించింది. 1 గిగావాట్ సామర్ధ్యంతో కూడిన ఏఐ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్ర‌బాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమలు చేస్తుండటంతో గూగుల్ డేటా సెంటర్ సాకారం కానుంది.

త్వరలోనే అందుబాటులోకి రానున్న `సబ్ సీ కేబుల్` వ్యవస్థ ద్వారా విశాఖ తో వివిధ దేశాలతో నేరుగా అనుసంధానం ఏర్పడనుంది. గూగుల్‌ డేటా సెంటర్ ద్వారా భారీగా డేటా స్టోరేజితో పాటు ఏఐ క్లౌడ్ ఇన్ ఫ్రా అందుబాటులోకి రానుంది. దీనికి ఈ నెల 28న చంద్ర‌బాబు చేతుల మీదుగా శంకుస్థాప‌న జ‌ర‌గ‌నుంది.

వాస్త‌వానికి తర్లువాడ, అడవి వరం, రాంబిల్లి ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో.. గూగుల్ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ ప్రాజెక్టులో అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ ట్రా లాంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా, భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించనుంది.

ఉద్యోగాలు ఇలా..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఆర్కిటెక్చర్, డేటా సైంటిస్ట్ వంటి రంగాల్లో వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనుంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రాష్ట్రంలో అనుబంధ రంగాల నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. పవర్ సిస్టమ్స్, కూలింగ్ టెక్నాలజీ, సర్వర్ తయారీ, నెట్‌వర్కింగ్ వంటి రంగాల్లో స్థానికంగా మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి.