దీదీ కోస‌మా.. మోదీ కోస‌మా..?

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ తొలిద‌శ‌లో ఓట‌ర్లు .. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో పోలింగ్ కేంద్రాల‌కు బారులు తీరారు. వేస‌వి తాపాన్ని కూడా లెక్క చేయ‌కుండా.. వేలాది మంది బూతుల వద్ద క‌నిపించారు. ఫ‌లితంగా బెంగాల్ ఎన్నిక‌ల్లో.. క‌డ‌ప‌టి స‌మాచారం మేర‌కు.. 95 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది రాష్ట్ర చ‌రిత్ర‌లోనే తొలిసారి అని సాక్షాత్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ ట్వీట్ చేశారు. ఇదంతా ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన చైత‌న్య‌మేన‌ని పేర్కొన్నారు.

రంగంలోకి షా!

వాస్త‌వానికి 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్‌లో తాజాగా 152 స్థానాల‌కు పోలింగ్ జ‌రిగింది. మొత్తం 16 జిల్లాల ప‌రిధిలో జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో.. ఈ రేంజ్‌లో ఓట‌ర్లు బ‌య‌ట‌కు వ‌స్తార‌ని.. ఎవ‌రూ ఊహించ‌లేదు. కాగా.. ఈ ప‌ర్య‌వ‌సానం వెనుక కేంద్ర ఎన్నిక‌ల సంఘంతోపాటు.. బీజేపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింద న్న వాద‌న ఉంది. ఓట‌ర్ల‌ను బూతుల వ‌ర‌కు ర‌ప్పించేందుకు.. ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను ప్రారంభించింది. నేరుగా రంగంలోకి కేంద్ర హోం మంత్రి అమిత్ షానే..దిగిపోయారు.

అమిత్‌షా కోల్‌క‌తాలోనే తిష్ఠ‌వేశారు. కార్య‌క‌ర్త‌లను ముందుండి న‌డిపించారు. దీంతోనే ఓటింగ్ భారీగా పెరిగింద‌న్న చ‌ర్చ ఉంది. దీనికితోడు కేంద్రా పారామిలిట‌రీ బ‌ల‌గాల‌ను దింపేయ‌డంతోపెద్ద‌గా ఎక్క‌డా గొడ‌వ‌లు లేకుండానే కార్య‌క్ర‌మం సాఫీగా సాగిపోయింది. అయితే.. బీజేపీ రాష్ట్ర సీనియ‌ర్ నేత సువేందు స‌ర్కార్‌పై తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లు దాడిచేశారు. దీంతో ఆయ‌న తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప‌లు చోట్ల కొద్దిపాటి ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి.

మోదీనా.. దీదీనా..?

ఇక‌, ఈ ఎన్నిక‌ల‌లో బీజేపీ ఒకే నినాదంతో ముందుకు సాగింది. ఎన్నిక‌ల‌కు ముందు ఎలాంటి ప్ర‌చారం చేసుకున్నా.. పోలింగ్ రోజు స్థానిక మీడియాలో `మోదీనా.. దీదీనా..` అనే చ‌ర్చ‌కు తెర‌దీసింది. ఫ‌లితంగా ఓట‌ర్లు ముందుకు వ‌చ్చార‌న్న‌ది బీజేపీ చెబుతున్న మాట‌. కాదు.. బీజేపీ కుయుక్తుల‌ను తిప్పికొట్టేందుకు ప్ర‌జ‌లు ఏక‌మ‌య్యార‌ని.. ఇది త‌మ‌కు క‌లిసి వ‌చ్చే అంశ‌మ‌ని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఉద్ఘాటించా రు. మ‌రోవైపు.. మే 4 త‌ర్వాత బీజేపీస‌ర్కారుఏర్పడుతుంద‌ని.. ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌టించారు.

ఇలా.. బెంగాల్ ఎన్నిక‌ల తొలిద‌శ ఒక‌ర‌కంగా.. ప్ర‌శాంతంగానే సాగిపోయింది. గ‌త 2021 ఎన్నిక‌ల్లో ఏడు ద‌శ‌ల్లో ఎన్నిక‌ల పోలింగ్ నిర్వ‌హించ‌గా.. ఐదుగురు మృతి చెందారు. వీటిలో రెండు హ‌త్య‌లు ఉన్నాయి. కానీ.. తాజా ఎన్నిక‌ల్లో చుక్క ర‌క్తం కూడా కార‌కుండా ఎన్నిక‌లు నిర్వ‌హించిన‌ట్టు ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. త‌దుప‌రి ద‌శ‌.. ఈ నెల 29న జ‌ర‌గ‌నుంది. ఈ ద‌శ‌లోనే సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ పోటీలో ఉన్న దుర్గాపూర్ స‌హా.. కీల‌క నాయ‌కులు, మంత్రుల నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. మ‌రో మూడు రోజులు ప్ర‌చారం చేసుకునేందుకు అవ‌కాశం ఉంది.