‘చంద్రబాబు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు’

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌తిప‌క్ష(ప్ర‌ధాన కాదు) నాయ‌కుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు రాష్ట్రంలో అన్యాయంగా పాల‌న చేస్తున్నార‌ని.. విమ‌ర్శించారు. తాజాగా వైసీపీ అనుకూల నాయ‌కుడు, ప్ర‌భుత్వ ఉద్యోగి, స‌చివాల‌య ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాక‌ర్ల వెంక‌ట్రామిరెడ్డిని ప్ర‌భుత్వం ఉద్యోగం నుంచి తొల‌గించింది. దీనిపై స్పందించిన జ‌గ‌న్‌.. భారీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అన్యాయంగా వెంక‌ట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి తొల‌గించార‌ని అన్నారు. ఉద్యోగులు రాజ‌కీయాల్లో భాగం కావ‌డం అనేది చంద్ర‌బాబు హ‌యాంలోనే ప్రారంభ‌మైంద‌న్నారు.

గ‌తంలో ఎన్‌జీవో సంఘం అధ్య‌క్షుడిగా ఉన్న‌ అశోక్ బాబును టీడీపీ వినియోగించుకోలేదా? అని ప్ర‌శ్నించారు. అప్ప‌ట్లో కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పుడు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్నారు. త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉండేవారికి ఒక నియమం.. మ‌రొక‌రికి మ‌రో నియ‌మ‌మా? అని నిల‌దీశారు. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో విఫ‌ల‌మైన చంద్ర‌బాబును ఎవ‌రూ ప్ర‌శ్నించ‌రాద‌న్న ధోర‌ణితో ఉన్నార‌ని ఆగ్ర‌హించారు. ఇది ప్ర‌జాస్వామ్యం లో స‌రైన విధానం కాద‌ని తెలిపారు.

హామీలు ఏమ‌య్యాయి?

ఎన్నిక‌లకు ముందు సూప‌ర్ సిక్స్ అంటూ ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయ‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఈ హామీల‌ను అమలు చేయాల‌ని ప్ర‌శ్నించినందుకే వెంక‌ట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి తీసేశార‌ని అన్నారు. ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌లేక పోతున్నార‌ని విమ‌ర్శించారు. ఈ క్ర‌మంలో హామీల‌ను అమ‌లు చేయాల‌న్న గ‌ళాల‌ను తొక్కేస్తున్నార‌ని విమ‌ర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మందిని ఉద్యోగాల నుంచి తీసేశార‌ని ఆరోపించారు. గ‌తంలో ఓ సీఐ.. అసెంబ్లీ సాక్షిగా చంద్ర‌బాబు అబ‌ద్ధాలు చెప్పార‌ని అన్నందుకు.. ఆయ‌న‌ను తొల‌గించార‌న్నారు.

వలంటీర్ల‌పై తొల‌సారి..

ఈ సంద‌ర్భంగా వైసీపీ హ‌యాంలో నియ‌మించిన వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌పై జ‌గ‌న్ తొలిసారి స్పందించారు. వారిని అన్యాయంగా రోడ్డు పాలు చేశార‌ని అన్నారు. తాము అధికారంలోకి వ‌స్తే.. 10 వేల రూపాయ‌ల వేతనం ఇస్తామ‌న్న హామీని నెర‌వేర్చ‌క‌పోగా.. వారిని గాలికి వ‌దిలేశార‌న్నారు. వైసీపీ హ‌యాంలో నియ‌మితులైన స‌చివాల‌య ఉద్యోగుల‌పైనా ఒత్తిడి తెచ్చి.. స్వ‌చ్ఛందంగా ఉద్యోగాలు వ‌దిలి వెళ్లిపోయేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ఈ కార‌ణంగా ఇప్ప‌ట‌కే ప‌లువురు మృతి చెందార‌ని ఆరోపించారు.