బెంగాల్ దంగ‌ల్‌: దీదీ 1500-బీజేపీ 3000..!

ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పాగా వేయాల‌ని కృత నిశ్చ‌యంతో ఉన్న బీజేపీ.. వ‌డివ‌డిగా ప‌రుగులు పెడుతోంది. ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునే విష‌యంలో స్థానిక అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఉర‌ఫ్ దీదీతో పోటీ ప‌డుతోంది. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్‌లో ఈ నెల 23, 29 తేదీల్లో రెండు విడ‌తలుగా ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల మేనిఫెస్టోలను కీల‌క పార్టీలు విడుద‌ల చేస్తున్నాయి. ఇటీవ‌ల సీఎం మ‌మ‌త త‌న పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. దీనిలో ఆమె ప్ర‌తి నెలా మ‌హిళ‌ల‌కు, నిరుద్యోగుల‌కు రూ.1500 చొప్పున ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. అలానే.. పెట్టుబ‌డుల‌కు ప్రాధాన్యం ఇస్తామ న్నారు. ఉద్యోగాల క‌ల్ప‌న‌కు.. కూడా ఇంపార్టెన్స్ ఇస్తామ‌ని చెప్పుకొచ్చారు.

అయితే.. దీదీకి పోటీగా.. బీజేపీ మ‌రిన్ని భారీ ప్ర‌క‌ట‌న‌లు గుప్పించింది. ప్ర‌ధానంగా నిరుద్యోగ యువ‌త‌కు ఇచ్చే నెల నెలా.. ఆర్థిక స‌హ‌కారాన్ని రూ.3000 ఇస్తామ‌ని తెలిపింది. అంతేకాదు.. వారికి ఉద్యోగం వ‌చ్చే వ‌ర‌కు కూడా దీనిని కొన‌సాగిస్తామ‌ని తెలిపింది. ఇక‌, మ‌హిళ‌ల‌కు దీదీ రూ.1500 ఇస్తానని చెప్ప‌గా.. బీజేపీ ఈ విష‌యంలోనూ డబుల్ బొనాంజా ప్ర‌క‌టించింది. తాము అధికారంలోకి వ‌స్తే.. 3000 చొప్పున ఇస్తామ‌ని ప‌క్కాగా చెప్పింది.

పంట నష్టాల కారణంగా సతమతమవుతున్న రైతులకు ఆప‌న్న హ‌స్తం అందిస్తామ‌ని చెప్పిన‌.. బీజేపీ.. కేంద్రం అమ‌లు చేస్తున్న `పీఎం కిసాన్‌`ను రాష్ట్రంలో అమ‌లు చేయ‌నున్న‌ట్టు తెలిపింది. వాస్త‌వానికి 2015 నుంచి పీఎం కిసాన్ అమ‌లవుతున్నా.. మ‌మ‌తా బెన‌ర్జీ.. ప‌శ్చిమ బెంగాల్ లో అమ‌లు చేయ‌డం లేదు. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన బీజేపీ. తాము అధికారంలోకి వ‌స్తే.. పీఎం కిసాన్‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్టు పేర్కొంది.

దీంతో పాటు.. మ‌హిళ‌ల‌కు ఉద్యోగాల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేస్తామ‌ని కూడా హామీ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. దీంతో బెంగాల్ దంగ‌ల్‌లో హామీల యుద్ధం కూడా ఓ రేంజ్‌లో సాగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా నెల నెలా ఇచ్చే సొమ్మును బీజేపీ 3000గా ప్ర‌క‌టించ‌డం ప్ర‌ధానంగా ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. గ‌తంలో ప‌లు రాష్ట్రాల్లో బీజేపీ కేవ‌లం రూ.1000 నుంచి రూ.1500 మాత్ర‌మే ఉచితంగా ప్ర‌క‌టించింది. కానీ, తొలిసారి బెంగాల్‌లో రూ.3 వేల చొప్పున ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.