అదే.. బాబుకు జ‌గ‌న్‌కు తేడా.. ఎంత సెంటిమెంటో!!

YS-Jagan-Chandrababu-Naidu

ఔను! తాజాగా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లో ప‌ర్య‌టిస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయ‌న ఇక్క‌డ ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో భారీ ఎత్తున వేల కొద్దీ కోట్ల‌తో చేయ‌నున్న అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. సాధార‌ణంగా ఏ ముఖ్య మంత్రికైనా.. త‌న సంత నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి అంటే.. ప్రాణం పెడ‌తారు. తాను పుట్టి పెరిగిన‌.. రాజ‌కీయంగా త‌న‌కు మంచి అవ‌కాశం ఇచ్చిన నియోజ‌క‌వ‌ర్గం క‌నుక అభివృద్ధి చేయాల‌ని భావిస్తారు. ఈ విష‌యంలో ఎలాంటి త‌ప్పూలేదు. కానీ, ఆ చేసే అభివృద్ధి నుంచి పెద్ద ఎత్తున రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌నే ఆలోచ‌న చేసేవారు చాలా త‌క్కువ‌.

ఉదాహ‌ర‌ణ‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబునే తీసుకుంటే.. ఆయ‌న కూడా చిత్తూరు జిల్లా కుప్పం నుంచి దాదాపు ఆరు సార్లు అంటే.. 35 ఏళ్లుగా విజ‌యం సాధిస్తున్నారు. ఇక్క‌డ అనేక అభివృద్ధి ప‌నులు కూడా చేశారు. కానీ, ఆశించిన విధంగా మాత్రం ఆయ‌న సెంటిమెంటును పెంచుకోలేక పోతున్నారు. అందుకే వైసీపీ నాయ‌కులు కుప్పంను టార్గెట్ చేసుకున్నారు. దీనికి కార‌ణం ఏంటి? మ‌రోవైపు పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ ఓ రేంజ్‌లో దూసుకుపోవ‌డానికి రీజ‌నేంటి? అంటే.. వ్యూహాత్మ‌క విన్యాస‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు. చంద్ర‌బాబు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి చేశారు. కానీ, ఒకేసారి కాదు.. అప్పుడ‌ప్పుడు చేశారు. అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల క‌ళ్లు చెమ్మ‌గిల్లేలా కూడా ఆయ‌న ఏనాడూ త‌న ప్ర‌సంగాల్లో సెంటిమెంటును పండించ‌లేక పోయారు.

కానీ, వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌ను చూస్తే.. సెంటిమెంటును పండించ‌డంతోపాటు.. ఇలాంటి నాయ‌కుడే కావాలి! అనే రేంజ్లో దూకుడు ప్ర‌ద‌ర్శించారు. తాజాగా పులివెందుల స‌భ‌లో మాట్లాడిన జ‌గ‌న్ ఇక్క‌డి ప్ర‌జ‌ల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారు. అనేక ప‌థ‌కాలు..(ఒకానొక ద‌శ‌లో ఈ జాబితా చ‌దువలేక పోయారు) ప్ర‌క‌టించారు. విద్య‌, సాగునీరు, మౌలిక స‌దుపాయాలు, పోలీస్ స్టేష‌న్లు.. ప‌రిశ్ర‌మ‌లు, రోడ్లు, ఇలా ఎన్నో విష‌యాల్లో కేటాయించిన‌నిధులు, చేస్తున్న ప‌నుల‌ను ఏక‌రువు పెట్టారు. దీంతో పులివెందుల ప్ర‌జ‌ల క‌ళ్ల‌లో సంతోషం పొట‌మ‌రించిన‌ట్టు క‌నిపించింది. వాస్త‌వానికి జ‌గ‌న్ చెప్పిన ప‌థ‌కాల‌న్నీ.. మ‌రో రెండు మూడు నెల‌ల త‌ర్వాత కానీ.. ప్రారంభం కావు. ఏదో ఒక‌టీ అరా మాత్రం ఇప్పుడు జ‌రుగుతున్నాయి.

కానీ, జ‌గ‌న్ గుండుగుత్తుగా ఏక‌బిగిన ప్ర‌క‌టించిన అభివృద్ధి ప్రాజెక్టుల‌పై ప్ర‌జ‌లు ఫిదా అయ్యారు. ఇక‌, చివ‌ర‌గా జ‌గ‌న్ మ‌రింత సెంటిమెంటు పండించారు. నేను ఎంత చేసినా.. పులివెందుల ప్ర‌జ‌ల‌కు చాలా త‌క్కువే. వారు నాకు ఎంతో ఇచ్చారు. న‌న్ను సొంత ఇంట్లో మ‌నిషిగా చూసుకున్నారు. మీకు నేను రుణ ప‌డి ఉంటా. నేను చేసేదానికంటే.. మీరు నాకు చాలా చేశారు అంటూ.. చేతులు ఎత్తి న‌మ‌స్క‌రించారు. ఈ ప్ర‌సంగం ఒక్క‌సారిగా స‌భ‌లో భావోద్వేగాన్ని నింపింది. మ‌హిళ‌ల క‌ళ్ల‌లో చిన్న క‌న్నీటి పొర క‌నిపించింది. హ‌ర్షాతి రేకాల‌తో మ‌రునిముషంలోనే స‌భ చ‌ప్ప‌ట్ల‌తో మార్మోగిపోయింది. మ‌రి.. ఇలా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌లేక పోతున్నారనేది టీడీపీ నేత‌ల గుస‌గుస‌!!