అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. తొలిసారి కేరళలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పలు చోట్ల నిర్వహించిన రోడ్ షోలలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేశారు.
అయితే భాషా సమస్య కామన్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున అనువాదం చేసేవారిని నియమించారు. నమస్కారం, ధన్యవాదాలు, ఓటు వేయండి వంటి వాటిని మలయాళంలోనే రేవంత్ రెడ్డి పలుకుతున్నా కీలకమైన ప్రసంగాలను మాత్రం ఇంగ్లీష్, హిందీలలో చేస్తున్నారు. ఇక దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా బుధవారం సాయంత్రం కేరళలోని ముట్టతార నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించి అనంతరం బహిరంగ సభలో కూడా ప్రసంగించారు. కేరళ అభివృద్ధికి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమిని బలపరచాలని ఆయన అభ్యర్థించారు.
మోడీపై విమర్శలు
తన ప్రచారంలో ఎక్కువగా రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేరళ ముఖ్యమంత్రి విజయన్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కేరళ వాసులు మతపరమైన రాజకీయాలను ప్రోత్సహించరని, మతం పరంగా విడిపోవడానికి కూడా ఇష్టపడరని చెబుతున్నారు. కానీ సీఎం విజయన్, ప్రధాని మోడీ తెరచాటు చేతులు కలిపి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూటమిని అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేరళవాసులు విద్యావంతులు, తెలివిగలవారని ప్రశంసించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
విజయనే మళ్లీ?
మరోవైపు తాజాగా వచ్చిన సర్వేల్లో ప్రస్తుత సీఎం విజయన్ నేతృత్వంలోని ఎల్ డీఎఫ్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని పేర్కొనడం గమనార్హం. అయితే మెజారిటీ తగ్గే అవకాశం ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో విజయన్కు ఫాలోయింగ్ ఉన్నప్పటికీ పట్టణాలు, నగరాల్లో మాత్రం వ్యతిరేకత కనిపిస్తోందని సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం 30 శాతం మంది మాత్రమే విజయన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటుండగా, ఇతర పార్టీల్లో అంత స్థాయిలో నాయకత్వం లేకపోవడమే ఆయనకు కలిసివస్తున్న అంశంగా సర్వేలు చెబుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
