తమిళనాడులోని శివకాశీ పేరు దాదాపు అందరికీ సుపరిచితమే. దీపావళి వచ్చిందంటే.. శివకాశీ పటాకుల కోసం ఎదురు చూస్తారు. వాటికి డిమాండ్ కూడా ఎక్కువే. దేశంలో పటాకులు తయారయ్యే మెజారిటీ ప్రాంతంగా కూడా శివకాశీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. శివకాశీని అధికారికంగా తమిళనాడు రాష్ట్రం పటాకుల తయారీ కేంద్రంగా కూడా గుర్తించింది. ఇక్కడ అనేక వసతులు కూడా కల్పించారు. మందుగుండు సామగ్రి నిల్వ నుంచి భద్రత వరకు ఇక్కడ పలు చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా ఎలాంటి పేలుడు సంభవించకుండాముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఒకవేళ ఏదైనా ప్రమాదం సంభవించినా తక్షణ చర్యలు తీసుకునేందుకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రాణ నష్టం తగ్గించే చర్య లు చేపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి వర్గ బృందాన్ని శివకాశీకి పంపించాలని నిర్ణయించా రు. ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని వేట్ల పాలెంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో పలువురు మృతి చెందడం.. మరికొందరు ఇంకా ఆసుపత్రల్లోనే ఉన్న నేపథ్యంలో అసలు ఇలాంటి ఘటనలు సంభవించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు.
దీనిలో భాగంగానే దేశంలోనే పేరొందిన శివకాశీకి మంత్రివర్గ సహచరులను పంపించాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం చంద్ర బాబు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. మంత్రులతోపాటు పోలీసు, ఫైర్,రెవెన్యూ శాఖలకు సంబంధించిన అధికారులను కూడా పంపించనున్నారు. వీరు ఆయా ప్రాంతాల్లో పర్యటించి.. కార్మికుల భద్రత, లైసెన్సు విధానాలు, పరిసర ప్రాంతాల్లో భద్రత సహా.. ఇతర అంశాలపై అధ్యయనం చేయనున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో కూడా తెలుసుకుంటా రు.
ఇదిలావుంటే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 50కి పైగా టపాసులు తయారు చేసే కేంద్రాలు ఉన్నాయి. వీటికి లైసెన్సులు ఉన్నాయి. లైసెన్సు లేని మరో 30 పరిశ్రమలు కూడా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆయా పరిశ్రమల నుంచి స్థానికుల భద్రత, ప్రమాదాల నివారణ సహా ఇతర అంశాలపై ముందస్తు చర్యలు తీసుకునేందుకు.. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా వ్యవహరించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates