పరామర్శ యాత్రలు కాదు… అసెంబ్లీకి రండి సార్..!

వైసీపీ అధినేత జగన్ రెండు రోజులపాటు పరామర్శ యాత్ర సిద్ధమవుతున్నారు. బుధవారం గుంటూరులో, శుక్రవారం ఇబ్రహీంపట్నంలో పర్యటించనున్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అయితే మీ నాయకుల ఇళ్లకు వెళ్ళి పరామర్శించడంతో పాటు అసెంబ్లీకి కూడా వచ్చి ఇదే అంశాలపై మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ నాయకులు సూచిస్తున్నారు. ఏ సమయంలో ఎవరెవరు ఏం మాట్లాడారో చర్చిద్దాం రమ్మంటున్నారు.

జగన్ మొదటి నుంచి పరామర్శల పేరుతో పర్యటనలు చేస్తూ భారీగా జనాన్ని సమీకరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణ. గతంలో గుంటూరు, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాలో ఆయన పర్యటన చేసినప్పుడు కార్యకర్తలు హల్చల్ చేశారు. ఒక దశలో ఆయన హెలికాప్టర్ కూడా ధ్వంసం చేశారు. దీంతో భద్రత కారణాల దృష్ట్యా ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వడానికి పోలీసులు కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు. 

మరో రెండు రోజుల్లో జరగబోయే జగన్ గుంటూరు, ఇబ్రహీంపట్నం పర్యటనలకు కూడా పోలీసులు అనుమతి తీసుకోవలసి ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల్లో తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తలు ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇటువంటి సమయంలో జగన్ పర్యటన చేయటం శాంతిభద్రతలకు భంగం కలిగించే అంశం అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 

ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. 11వ తేదీన మొదలై అసెంబ్లీ సమావేశాలకు వైయస్ జగన్, తన ఎమ్మెల్యేలతో కలిసి హాజరై, తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై, అదేవిధంగా పార్టీ నేతల దూషణలపై చర్చకు రావాలని టిడిపి మంత్రులు కోరుతున్నారు. అయితే జగన్ అసెంబ్లీకి వస్తారా..? లేక ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానంటూ పర్యటనకే సరి పెడతారా అనేది చూడాల్సి ఉంది.