అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన ఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. కల్తీ నెయ్యి ఇష్యూలో వైసీపీ నేతలపై రాజకీయ విమర్శలకే టీడీపీ నేతలు పరిమితం కాగా…అంబటి హద్దు మీరి చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగారు.

దీంతో, అంబటిపై టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడూ సైలెంట్ గా ఉంటూ రాజకీయపరంగా సునిశితమైన విమర్శలు చేసే గుంటూరు ఎంపీ పెమ్మసాని వంటి నేతలు కూడా అంబటిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

అంబటిని ఇప్పటివరకు సహనంతో భరించామని, కానీ, ఈరోజు నుంచి అంబటి రాంబాబుకు నిజమైన సినిమా చూపిస్తామని పెమ్మసాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 24 గంటల్లో తమ రియాక్షన్‌ ఎలా ఉంటుందో తెలుస్తుందని అంబటిని హెచ్చరించారు. బరితెగించి మాట్లాడేవారు.. భయపడేలా ట్రీట్‌మెంట్‌ ఉంటుందని పెమ్మసాని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. చట్టబద్ధంగా వెళ్తే ఏం జరుగుతుందో అంబటి రాంబాబుకు తెలుస్తుందని అన్నారు.

నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, పూర్తి జీవితాన్ని సుఖ సంతోషాలకు దూరంగా ప్రజల కోసం కేటాయించిన వ్యక్తి చంద్రబాబును అలా అనడం ఏంటని మండిపడ్డారు. పొద్దున్నుంచి రాత్రి పడుకునేవరకు రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తి గురించి ఇలా మాట్లాడిన అంబటిని ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు.

అంతేకాదు, అంబటికి ఇచ్చే ట్రీట్మెంట్ అంబటిలా బరితెగించి మాట్లాడే వారందరికీ గుణపాఠంగా ఉంటుందని అన్నారు. ఇంకోసారి అలా మాట్లాడకూడదు అని అంబటి రాంబాబుకు తెలిసి వచ్చేలా ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పారు. చంద్రబాబును దుర్బాషలాడారని టీడీపీ కార్యకర్తలు ఆవేశంతో ఉన్నారని, కానీ, చట్టప్రకారం పోదామని తానే వారికి సర్ది చెప్పానని తెలిపారు.

ఇక, అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హితవు పలికారు. సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబటి వ్యాఖ్యలు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని, స్థాయి, సంస్కారం మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు కారు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ విమర్శలు చేస్తే సహిస్తామని, కానీ, వ్యక్తిత్వ హననం చేస్తే సహించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.