అమరావతిపై ఆయన డాక్యుమెంటరీ ఎలా ఉంది?


గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రాజధానిగా ఎంచుకున్న అమరావతికి వైకాపా సర్కారు మరణ శాసనం రాసేసి ఏడాది దాటిపోయింది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని చెబుతున్నప్పటికీ.. అది పేరుకు మాత్రమే. దీని ఉద్దేశమేంటన్నది అందరికీ తెలిసిందే. అమరావతిని నిర్వీర్యం చేయడానికి ఏం చేయాలో అన్నీ చేస్తోంది జగన్ సర్కారు. గత ప్రభుత్వ మాటల్ని, ఒప్పందాల్ని నమ్మి అమరావతికి తమ భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఏడాదిగా వాళ్లు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ రోజుతో వారి పోరాటానికి 365 రోజులు పూర్తయ్యాయి.

ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్ ‘రాజధాని విషాదం-అమరావతి’ పేరుతో గంటకు పైగా నిడివితో ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. సాధ్యమైనంత వరకు పక్షపాతానికి తావు లేకుండా.. రైతుల వ్యధను కళ్లకు కడుతూ హృద్యంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. దీనికి రచన, స్క్రీన్ ప్లే, పరిశోధన, మాటలు, దర్శకత్వం అన్నీ కూడా పరకాలనే చేశారు.

అమరావతి చరిత్రతో మొదలు పెట్టి.. అశాస్త్రీయమైన విభజన తర్వాత ఏ పరిస్థితుల్లో అమరావతి రాజధాని అయిందో వివరించే ప్రయత్నం చేశారు పరకాల. గత ఎన్నికల్లో ప్రభుత్వం మారాక ఎలా అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరిగిందో కూడా కూలంకషంగా వివరించారు. ఈ క్రమంలో రాజధాని తరలించొద్దంటూ ఆందోళనలు చేస్తున్న రైతులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు సేకరించారు. వైకాపా తరఫున అంబటి రాంబాబు.. తెలుగుదేశం తరఫున రాజధాని ఎంపికలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి నారాయణ, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్.. కమ్యూనిస్టు పార్టీల తరఫున మధు, రామకృష్ణ.. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్, వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఓ న్యాయ నిపుణుడి అభిప్రాయాలు ఇందులో పొందుపరిచారు.

మెజారిటీ అభిప్రాయం వేల కోట్ల ఖర్చుతో అనేక నిర్మాణాలు పూర్తయి, మధ్య దశలో ఉండగా అమరావతి నుంచి రాజధానిని తరలించడం తప్పు అనే వ్యక్తమైంది. రైతుల బాధల్ని అసలేమాత్రం ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఇందులో ప్రధానంగా అందరూ తప్పుబట్టారు. అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడాన్ని తప్పుబడుతూనే.. ఇప్పుడు రైతులతో ఒప్పందాల్ని ఉల్లంఘించి అక్కడి నుంచి రాజధాని తరలించడం సాధ్య పడదని, ఈ విషయంలో న్యాయపోరాటంలో రైతులే గెలిచే అవకాశం ఉందని ఉండవల్లి అభిప్రాయపడటం గమనార్హం.

గత తెలుగుదేశం ప్రభుత్వంలో పరకాల ప్రభాకర్ సలహాదారుగా ఉన్నప్పటికీ.. చంద్రబాబును విమర్శించడానికి పరకాల వెనుకాడలేదు. పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ.. ఓటుకు నోటు కేసు వల్ల అక్కడి నుంచి ఏడాదికే తరలి వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చిన విషయాన్ని ఈ డాక్యుమెంటరీలో చూపించారు. అలాగే ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాలన్న ఆలోచనే తప్ప.. రాజధానులు వాటంతట అవే మహా నగరాలుగా ఎదగాలంటే రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు అనుకూలించాలనే వాస్తవాన్ని చంద్రబాబు విస్మరించారని పరకాల అభిప్రాయపడ్డారు.

ఇక జగన్ సర్కారు ఎన్నికలకు ముందు, తర్వాత రాజధాని విషయమై ఎలా మాట మార్చిందో.. భూములిచ్చిన రైతులకు ఎలా అన్యాయం చేస్తోందో వివరించారు. మరోవైపు మూడు రాజధానుల వల్ల దక్షిణాఫ్రికా ఎలా ఇబ్బంది పడుతోందో అక్కడి నిపుణుల అభిప్రాయాలను కూడా ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచారు పరకాల.