ఉచిత బస్సు ప్రయాణం హామీ ఎఫెక్ట్ మామూలుగా లేదు. మన దేశంలో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి, ఏపీలో కూటమి గెలుపునకు ఈ హామీ కీలకంగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు న్యూయార్క్ మేయర్ ఎన్నికలోనూ ఇటువంటి హామీనే అక్కడి అభ్యర్థి గెలుపునకు దోహదపడింది. న్యూ యార్క్ వామ పక్ష నేత జోహ్రాన్ మంథాని ఎన్నికయ్యారు. ఆయనను ఓడించేందుకు స్వయంగా ట్రంప్ ప్రచారం చేసినా ఫలించలేదు. మమ్దానీ విజయంలో అత్యంత కీలకమైన హామీ ఉచిత సిటీ బస్సు ప్రయాణం ఒకటి అని భావిస్తున్నారు. భారతీయ, ఉగాండా మూలాలు ఉన్న మమ్దాని 34 ఏళ్లకే మేయరుగా ఎన్నికయ్యారు. ఆయన సినీ దర్శకుడు మీరా నాయర్ కుమారుడు.
అసలు విషయానికి వస్తే.. ఏపీలో కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఫ్రీబస్సు పథకాన్ని అమలు చేస్తోంది. అంతకు ముందే ఈ పథకాన్ని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అమలు చేశాయి. ఇప్పుడు ఇదే అంశం న్యూయార్క్మేయర్ఎన్నికలోనూ తెరపైకి వచ్చింది. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు జోహ్రాన్ మమ్దాని తన ఎన్నికల ప్రచారంలో బస్సులను ప్రధాన అంశంగా చేర్చాడు. కరోనా మహమ్మారి సమయంలో ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయోగాత్మక కార్యక్రమాన్ని విస్తరించి, అన్ని నగర బస్సులను ఉచితంగా మార్చే ప్రణాళికను ప్రతిపాదించారు.
బస్సుల వేగాన్ని పెంచడానికి ప్రత్యేక బస్ లేన్లు కూడా విస్తరించాలని ఆయన సూచించారు. ఈ ఉచిత బస్సు ప్రాజెక్టు కోసం అయ్యే ఖర్చును కార్పొరేట్ పన్ను రేటును పెంచడంతో పాటు, వార్షిక ఆదాయం మిలియన్ కంటే ఎక్కువ ఉన్న అక్కడి స్థానికులపై ఆదాయ పన్ను పెంచడం ద్వారా సమకూర్చాలని భావిస్తున్నట్లు గతంలో ఆయన ఎన్నికల ప్రచారంలో తెలిపారు. ఆయన ప్రత్యర్థి మాజీ గవర్నర్ ఆండ్రూ కువోమో ఈ ప్రతిపాదనను విమర్శించారు.
అయితే ఈ రోజు మమ్దానీ ఎన్నిక తర్వాత ఉచిత బస్సు హామీ మన తెలుగు రాష్ట్రాల్లో వార్తలలో నిలిచింది. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఉంది, అక్కడి మహిళలకు స్మార్ట్ కార్డ్ జారీ చేశారు. మహారాష్ట్రలో మహిళలకు బస్సు టిక్కెట్లపై 50శాతం రాయితీ ఇస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం, తెలంగాణలో మహిళలకు బస్సు ప్రయాణం ఉచితమే. ఇదే పద్ధతి ధనిక ప్రదేశం అయిన న్యూయార్క్లో తీసురావడం కొంత ఆశ్చర్యమే మరి..!
Gulte Telugu Telugu Political and Movie News Updates