ఎవ‌రీ దీప‌క్ రెడ్డి?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ తర‌ఫున లంక‌ల దీప‌క్ రెడ్డికి టికెట్ ఖ‌రారైంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయిన ఈ సీటు విష‌యంపై ఎట్ట‌కేల‌కు క‌మ‌ల నాథులు నిర్ణ‌యం తీసుకున్నారు. బుధ‌వారం దీప‌క్ రెడ్డి పేరును ఖ‌రారు చేశారు. ప్ర‌స్తుతం నామినేష‌న్ల ప‌ర్వం ప్రారంభ‌మైన నేప‌థ్యంలో దీప‌క్ రెడ్డి పేరును ఖ‌రారు చేస్తూ పార్టీ అధిష్టానం పెద్ద‌లు నిర్ణ‌యించారు. ఈ మేర‌కు పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ నడ్డా నిర్ణ‌యించారు.

దీప‌క్ రెడ్డి బీజేపీలో చాలా కాలం నుంచే ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌ల‌కు అత్యంత స‌న్నిహితుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, అన్ని పార్టీల్లోనూ ఆయ‌న‌కు మిత్రులు ఉన్నార‌ని అంటారు. ఆర్థికంగా కూడా వ్యాపారాలు నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. మ‌రోవైపు ఈ స్థానం నుంచి ముగ్గురు బ‌రిలో నిలిచిన విష‌యం తెలిసిందే.

అయితే, ఆది నుంచి కూడా లంక‌ల దీప‌క్ రెడ్డి విష‌య‌మే చ‌ర్చ‌కు వ‌చ్చింది. కేంద్రంలో తెలంగాణ తరఫున చ‌క్రం తిప్పుతున్న కిష‌న్ రెడ్డి దీప‌క్ రెడ్డికే మ‌ద్ద‌తు ఇస్తున్నార‌న్న వాద‌న వినిపించింది. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో డిపాజిట్ కోల్పోయిన నేప‌థ్యంలో దీప‌క్ రెడ్డికి ఈ సారి ఇవ్వ‌బోర‌ని కొంద‌రు నాయ‌కులు వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో మ‌హిళా నాయ‌కురాళ్ల‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అనుకున్నారు.

కానీ, చివ‌రి నిమిషం వ‌ర‌కు వేచి చూసిన పార్టీ పెద్ద‌లు కిష‌న్ రెడ్డి నిర్ణ‌యానికి ఆమోదం తెలిపార‌ని తెలుస్తోంది. కాగా, దీప‌క్ రెడ్డి 2023లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. అయితే, ఆయ‌న 25 వేల ఓట్లు మాత్ర‌మే రాబ‌ట్ట‌గ‌లిగారు. దీంతో డిపాజిట్ కూడా ద‌క్క‌లేదు. మ‌రోవైపు, ప్ర‌స్తుతం సెంటిమెంటు పాలిటిక్స్ నేప‌థ్యంలో ఆయ‌న ఏమేర‌కు విజ‌యం ద‌క్కించుకుంటారో చూడాలి.