“ప్ర‌జ‌ల‌ను మోసం చేసే వాడే… నాయకుడు!“

“ప్ర‌జ‌ల‌ను ఎంత బాగా మోసం చేసే ల‌క్ష‌ణం ఉంటే.. వారే నాయ‌కులు అవుతారు“ అని కేంద్ర మంత్రి… బీజేపీ నేత నితిన్ గ‌డ్క‌రీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌ర‌చుగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. పైగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి వ్య‌తిరేకంగా ఆయ‌న వ్యాఖ్య‌లు చేస్తార‌న్న పేరు కూడా తెచ్చుకున్నారు. అయినా.. త‌ను చెప్పాల‌ని అనుకున్న‌ది నిర్మొహ‌మాటంగా చెప్పారు. ఇలానే తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నారు.

`అఖిల భారత మహానుభావ పరిషత్తు` తాజాగా మ‌హారాష్ట్ర‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాలో కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ మాట్లాడుతూ.. షార్ట్ క‌ట్ విజ‌యం స‌రికాద‌న్నారు. రోడ్డుపై సిగ్న‌ల్ పాటించ‌కుండా..షార్ట్ క‌ట్‌లో వెళ్తే ఏం జ‌రుగుతుందో అంద‌రికీ తెలిసిందేన‌ని అన్నారు. ఇమ్మీడియెట్ గెయిన్ కోసం.. ప‌ని చేయ‌డం స‌రికాద‌న్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప‌రోక్షంగా నేత‌ల గురించి ప్ర‌స్తావించారు. నేటి త‌రం రాజ‌కీయాల్లో త‌న లాంటి వాడిని భ‌రిస్తున్నార‌ని.. `నాగపూర్` ప్ర‌జ‌ల‌కు ఆయ‌న థ్యాంక్స్ చెప్పారు.

అదేస‌య‌మంలో సమాజంలో ఇంకా..  నిజాయతీ, విశ్వసనీయత, అంకితభావం, నిజం అనే విలువలు ఉన్నాయ‌ని.. ప్ర‌జ‌లు వాటిని వ‌దిలేశార‌ని అన‌డం స‌రికాద‌న్నారు. అలా ఉండ‌బ‌ట్టే.. త‌న‌ను గెలిపిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. అయితే..నేటి త‌రం నాయ‌కుల్లో ఇది లోపిస్తోంద‌న్నారు. ప్ర‌జ‌ల‌ను న‌మ్మ‌కంగా మోసం చేసేవాడే.. నాయ‌కుడు అనుకుంటున్నార‌ని.. కానీ తాను వారిలా ఉండ‌లేన‌ని వ్యాఖ్యానించారు.  నిజానికి, నిజాయితీకీ.. ప‌ట్ట‌క‌ట్ట‌డం వ‌ల్ల‌.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఉండొచ్చ‌ని సూచించారు.

“నేను రాజ‌కీయాల్లో ఉంటే.. నిజం మాట్లాడ‌ను. ఎందుకంటే.. ఇవి అంద‌రికీ న‌చ్చ‌వు. ఇంట్లో ఉంటే.. అబ‌ద్ధం చెప్ప‌ను. ఎందుకంటే.. అక్క‌డ ఎవ‌రూ స‌హించ‌రు. కానీ.. నేటి త‌రం నాయ‌కుల్లో నిజాయితీ క‌నిపిచ‌డం లేదు. మోసం చేసేవారు.. దౌర్జ‌న్యాలు చేసేవారు.. ప్ర‌జ‌ల‌ను వంచించేవారు.. న‌మ్మ‌కంగా వారిని బుట్ట‌లో వేసుకునేవారే.. నాయ‌కులు అనేలా చ‌లామ‌ణి అవుతున్నారు“ అని గ‌డ్క‌రీ నిప్పులు చెరిగారు. అయితే.. ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు ఎవ‌రిని ఉద్దేశించి.. అనేది చ‌ర్చ‌కు దారితీస్తోంది.