నిరుద్యోగుల‌కు నారా లోకేష్ గుడ్ న్యూస్‌!

మీరు నిరుద్యోగులా? అయితే.. ఇది మీకోస‌మే. ఏపీలోని నిరుద్యోగుల‌కు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో చాలా మందికి త‌మ రెజ్యూమ్‌ను తాము రూపొందించుకునే ప‌ద్ధ‌తి కూడా తెలియ‌దు. దీంతో చాలా ప్రైవేటు సంస్థ‌లు.. నిరుద్యోగుల‌కు దూరంగానే ఉండిపోయాయి. నిజానికి ఉద్యోగం ఇచ్చేముందుఏ సంస్థ అయినా.. ఉద్యోగి చ‌దువు, అనుభ‌వంతోపాటు.. సామాజిక సృహ‌, గుణ గ‌ణాల‌ను కూడా రెజ్యూమ్ ఆధారంగానే తెలుసుకుంటుంది. గ‌త నెల‌లో అసోచాం చేప‌ట్టిన స‌ర్వేలో దేశ‌వ్యాప్తంగా 68 శాతం మంది నిరుద్యోగుల‌కు రెజ్యూమ్ ప్రిప‌రేష‌న్ తెలియ‌ద‌ని పేర్కొంది.

ఉదాహ‌ర‌న‌కు టీసీఎస్‌, టీసీఎల్ వంటి ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీలు ఉద్యోగం ఇచ్చే ముందు.. ఖ‌చ్చితంగా రెజ్యూమ్‌లోని వివ‌రాల‌ను ఆధారంగా చేసుకునే ఇంట‌ర్వ్యూల‌కు, ప‌రీక్ష‌ల‌కు పిలుస్తాయి. కానీ, రెజ్యూమ్‌లోనే త‌ప్పులు దొర్ల‌డం.. వాటిని స‌రిగా పూర్తి చేయ‌క‌పోవ‌డంతోపాటు.. అభ్య‌ర్థి అస‌లు.. రెజ్యూమ్‌లో వెల్ల‌డించాల్సిన అంశాల‌పై కూడా క్లారిటీ లేక‌పోవ‌డంతో అనేక మంది నిపుణులై ఉండి కూడా.. ఉద్యోగాలు పొంద‌లేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు సూప‌ర్ చాన్స్ తీసుకువ‌చ్చింది.

అదే.. ‘నైపుణ్యం’ పోర్ట‌ల్‌. తాజాగా దీనిపై మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. నిరుద్యోగుల‌కు మేలు చేసేలా ‘నైపుణ్యం’ పోర్టల్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు. రాష్ట్ర స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగంగా ద్వారా దీనిని రూపొందించ‌నున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు.. త‌మ విద్య‌, ప్రాంతం, పేరు, ఉపాధి వివ‌రాల‌ను నైపుణ్యం పోర్ట‌ల్‌లో పొందు ప‌రిస్తే.. చాలు అద్భుత‌మైన రెజ్యూమ్‌ను ఇది రూపొందించి.. అందిస్తుంది. త‌ద్వారా.. మెరుగైన ఉద్యోగాల‌ను ఇట్టే పొందే అవ‌కాశం ఉంటుంది.

ఈ మేర‌కు.. నారా లోకేష్‌.. నైపుణ్యం పోర్ట‌ల్‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తున్న‌ట్టు తెలిపారు. 90 రోజులపాటు ఈ పోర్ట‌ల్‌పై అవ‌గాహ‌న కూడా క‌ల్పిస్తారు. జిల్లాలు, మండ‌లాల వారీగా నిరుద్యోగుల‌ను గుర్తించి.. వారి వివ‌రాల‌ను ఈ పోర్ట‌ల్‌లో చేరుస్తారు. త‌ద్వారా.. వారికి రెజ్యూమ్‌ను సౌల‌భ్యం చేయ‌నున్నారు. ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా రెజ్యూమ్‌ సిద్ధమయ్యేలా తీర్చిదిద్దుతారు. దీంతో ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీల్లో ఉద్యోగాల‌ను సులువుగా పొందేందుకు అవ‌కాశం ఉంటుంది.