దక్షిణాది రాష్ట్రం తమిళనాడుకు గత కొంతకాలంగా గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ఎన్ రవి నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు. నిన్నటిదాకా తమిళనాడులోని అదికార డీఎంకే నిర్ణయాలను వ్యతిరేకించిన కారణంగా ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిస్తే… ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకుని ఆయన ఏకంగా ఆపకుండా 51 పుషప్స్ తీశారు. అదేదో ఆయన ఇంటిలో తీసి వీడియో విడుదల చేశారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. యోగా డేను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేదిక మీద అందరి కళ్ల ముందే ఆయన కుర్రాళ్లు సైతం అసూయ పడేలా పుషప్స్ లాగించేశారు.
తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి తీసిన ఈ పుషప్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే… రవి వయస్సు ఏ 20 ఏళ్లో, 30 ఏళ్లో కాదు… అక్షరాల 73ఏళ్లు. అంటే వృద్ధుడి కిందే లెక్క. అయితే నిత్యం ఫిట్ నెస్ తో కనిపించే రవి… తన బాడీని ఎప్పుడు తన అధీనంలో పెట్టుకుని కళకళలాడిపోతూ ఉంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరే రవి కూడా ఏం చేస్తారో గానీ 73 ఏళ్ల వయసులోనూ వయోభారమన్నదే కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు.
అయితే కొందరు మాత్రం రవి 51 పుషప్స్ తీయడంలో పెద్ద విశేషమేమీ లేదులే అని కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే… బీహార్ కు చెందిన రవి… పూర్వాశ్రమంలోఐపీఎస్ అదికారి. కేరళ కేడర్ ఐపీఎస్ అధికారిగా ఓ దశాబ్దం పాటు పనిచేసిన ఆయన ఆ తర్వాత సీబీఐలో ఓ రేంజిలో సత్తా చాటారు. పోలీసు అధికారి అయిన రవి ఆ మాత్రం ఫిట్ నెస్ మెయింటెన్ చేయడంలో ఆశ్చర్యం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అయితే 73 ఏళ్ల వయస్సున్న రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరినైనా తీసుకువచ్చి రవి మాదిరి పుషప్స్ తీయమనండి ఎదురు దాడికి దిగుతున్నారు. వెరసి రవి వీడియో వైరల్ అయిపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates