తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఆదివారం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఏపీలో అధికార కూటమి రథసారథి టీడీపీ అంటే నిత్యం ఎగిరెగిరిపడే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్.. ఇద్దరూ పక్కపక్కనే కలిసి కూర్చుని కనిపించారు. అంతేకాదండోయ్… కేసీఆర్, లోకేశ్ లు కలిసి కూర్చోగా, కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారి వెనకాలే నిలబడి కనిపించారు. ఈ సన్నివేశం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు నివాళి అర్పించే సందర్భంగా కనిపించింది.
మాగంటి పూర్వాశ్రమంలో టీడీపీ నేతే. అంతేనా టీడీపీతోనే మాగంటి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగానే ఆయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నుంచి బయటకు వచ్చిన మాగంటి బీఆర్ఎస్ లో చేరారు. టీడీపీలో ఎంత కీలక నేతగా ఎదిగారో బీఆర్ఎస్ లోనూ అంతే కీలక నేతగా ఎదిగారు. కేసీఆర్ నమ్మకస్తుల్లో ఒకడిగా గుర్తింపు పొందారు.
గుండెపోటు కారణంగా గత గురువారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన మాగంటి…చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 5.45 గంటలకు మరణించారు. ఈ క్రమంలో తనకు అత్యంత నమ్మకస్తుడిగా కొనసాగిన మాగంటికి నివాళి అర్పించేందుకు కేసీఆర్ స్వయంగా తరలివచ్చారు. మాగంటి భౌతిక కాయాన్ని చూసి ఆయన కన్నీటిపర్యంతం అయ్యారు. అదే సమయంలో లోకేశ్ కూడా మాగంటికి నివాళి అర్పించేందుకు తన సతీమణి బ్రాహ్మణితో కలిసి వచ్చారు.
ఈ సందర్భంగా కేసీఆర్ కూర్చున్న దగ్గరకు వచ్చిన లోకేశ్… ఆయన పక్కనే కూర్చున్నారు. బ్రాహ్మణి కూడా వారి పక్కనే కూర్చున్నారు. వారిద్దరూ ఇలా చాలాసేపే అలా పక్కపక్కనే కూర్చున్నప్పటికీ వారి మధ్య మాటలు అయితే పెగల లేదనే చెప్పాలి. మాగంటి మృతితో కేసీఆర్ నోట మాట రాని స్థితిలోకి వెళ్లగా…టీడీపీలో సుదీర్ఘ కాలంగా ఉన్న మాగంటి మరణంతో లోకేశ్ కూడా ఆయనతో తన సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ అలా ఉండిపోయారు. వెరసి కేసీఆర్, లోకేశ్ లు చాలా సేపు కలిసే కూర్చున్నా వారు మాట్లాడుకోలేకపోయారు.