‘అన్ని వర్గాలు కీర్తించే వ్యక్తి ఎన్టీఆర్’

కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయనకు టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఘన నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. సంక్షేమానికి సరికొత్త దారి చూపించిన సంఘసంస్కర్త అన్న నందమూరి తారక రామారావుకు ఘన నివాళులు అర్పిస్తున్నానని చంద్రబాబు అన్నారు.

పేదలకు కూడు, గూడు, దుస్తులు అనే అవసరాలను తీర్చడమే జీవితాశయంగా భావించిన ధీరోదాత్తుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి సరికొత్త అర్థం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు. నా తెలుగు జాతి సగర్వంగా తలెత్తుకుని నిలబడాలి అన్న సంకల్పమే ఆయనను ఆ స్థాయికి తీసుకువెళ్లిందని అన్నారు. చరిత్రలో స్థానం సంపాదించుకోవడం కాదని…చరిత్రను సృష్టించిన చిరస్మరణీయుడు అన్న ఎన్టీఆర్ అని ప్రశంసించారు.

నేడు తెలుగుదేశం పార్టీ ఉజ్వలంగా ప్రకాశిస్తుందంటే అది ఆయన ఆశీర్వాదబలమని చెప్పారు. ఆ మహనీయుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు అహర్నిశలు పాటు పడుతూనే ఉంటామని ప్రతిజ్ఞబూనారు.

నీతి, నిజాయితీ, పట్టుదల ఎన్టీఆర్ ఆయుధాలని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగుజాతికి పండుగ వంటి రోజని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తి సినీ రంగంలో, రాజకీయ రంగంలో రారాజుగా రాణించడం చరిత్రలో చూడలేదని అన్నారు.

తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్టు శిఖరం అంత ఎత్తుకు ఎన్టీఆర్ ఎదిగారని పొగడ్తలతో ముంచెత్తారు. 33 ఏళ్లు వెండితెరపై, 13 ఏళ్లు రాజకీయాలలో అద్వితీయ చరిత్ర సృష్టించిన ఘనత అన్నగారిదని అన్నారు. ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా అని, రైతులకు నేస్తమని చెప్పారు. అధికారమంటే బాధ్యత…పదవి అంటే సేవ అని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. అన్ని వర్గాల వ్యక్తులు కీర్తించే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. పాలకులు అంటే సేవకులంటూ దేశ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు తెలుగుజాతి బ్రతికున్నంత కాలం ఎన్టీఆర్ గుర్తుంటారని, తెలుగు ప్రజల నమ్మకం విశ్వాసం భరోసా టీడీపీ జెండా అని చంద్రబాబు అన్నారు. అన్నగారు రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా రెపరెపలాడుతూనే ఉంటుందన్నారు.